“సమతామూర్తి” సాక్షిగా పవన్ Vs జగన్!

Pawan Kalyan and Jagan at Statue of Equality‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ నిదర్శనంగా 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహ ఆవిష్కరణ తదుపరి రోజు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేసి తన బాణీని వినిపించగా, మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తెలుగుదనాన్ని ప్రదర్శించి శ్రోతల సహనానికి పరీక్ష పెట్టారు.

రెండు రోజుల వ్యవధిలో ఏపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు విచ్చేయడంతో, సహజంగానే వీరిద్దరిలో ఎవరు బాగా మాట్లాడారు, చరిత్రను ఉద్దేశించి ఎవరు చక్కగా ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు? అన్న పోలిక వస్తుంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడిన విధానం మరియు జగన్ ప్రసంగించిన వైనం… రెండూ కలిపి ఓ వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు.

ADVERTISEMENT

తొలుత పవన్ ప్రసంగాన్ని పరిశీలిస్తే… తనకు తెలిసినంతలో రామానుజాచార్యుల గురించి ఉదహరించారు. వెనుకబడిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేని రోజుల్లో.., భగవంతుడుని చేరుకునే జ్ఞానం కొద్ది మందికే పరిమితం చేసిన రోజుల్లో… ఆలయ ప్రవేశం అందరికి తీసుకువచ్చిన గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యుల గారు.

ఇలాంటి పరిస్థితి వేరే దేశాలలో, వేరే మతాలలో జరిగినపుడు బలి తీసుకోవడం లేక వెలివేయడం జరిగేది. కానీ భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి జగత్ ఆచార్యులుగా పిలవబడుతోంది. అలాంటి రామానుజాచార్యుల వారి గురించి పుస్తకాలు చదివే వారికి లేక వైష్ణవ సంప్రదాయాలు పాటించే వారికి మాత్రమే తెలుసు.

కానీ భారతదేశం అంతా తెలిసేలా 216 అడుగుల పై చిలుకు విగ్రహం మాత్రమే కాదు, సమతామూర్తికి అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, వివిధ సంప్రదాయాలు, విభిన్న సంస్కృతులకు సంకేతంగా, సమతికి నిదర్శనంగా ఆ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూల కారకులు శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మహాసంకల్పమే కారణమని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్ద దిక్కు అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం అంతా “మంత్రం – పాపం” చుట్టే తిరిగింది. ఈ ఉపోద్ఘాతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, తెలుగు అంత శ్రేయస్కరంగా ఉంటుందనే విధంగా తనదైన శైలిలో యధావిధిగా మాట్లాడారు. సింపుల్ గా చెప్పాలంటే… తెలియని సబ్జెక్టు గురించి స్టూడెంట్ ని మాట్లాడమంటే ఎలా మాట్లాడతారో, ఏపీ సీఎం కూడా అలాగే మాట్లాడారు.

దీంతో వీరిద్దరి ప్రసంగాలను క్రోడీకరించి జనసైనికులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ప్రతిభా పాటవాల ముందు జగన్ ఏ మాత్రం సరిపోరని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గం కూడా ఏ మాత్రం తగ్గకుండా, ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది, జగన్ మోహన్ రెడ్డికున్న ఇతర నైపుణ్యాలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ రెండు పార్టీల అభిమానులు ఇలా సందడి చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లోని మరో పార్టీ తెలుగుదేశం కూడా తన వంతు పాత్రను సోషల్ మీడియాలో పోషిస్తోంది. సమతామూర్తి విగ్రహం వద్ద తెలుగులో తడబడిన జగన్ మోహన్ రెడ్డి వీడియోను పోస్ట్ చేస్తూ “నేటి జగన్ రెడ్డి జ్ఞానగుళిక”గా వైరల్ చేస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వస్తున్నారంటే, టీడీపీ ‘గుళికలతో’ సిద్ధమైపోతోంది.

ADVERTISEMENT
Latest Stories