పవన్ కళ్యాణ్ టిడిపి వైపు మొగ్గిన తర్వాత జనసేనతో పొత్తులు కొనసాగించాలనుకొంటోందో లేదో బీజేపీ ఇంతవరకు చెప్పనేలేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అయితే ప్రతీ ఎన్నికలలో జనసేన బీజేపీ కోసం త్యాగాలు చేస్తూపోతే ఇక పార్టీ నడిపించడమే అనవసరం కదా?కనుక తెలంగాణలో 32 స్థానాలకు జనసేన పోటీ చేయాలనుకొంటోందని, కనుక ఇప్పుడు వెనక్కు తగ్గితే పార్టీ శ్రేణులు నిరాశ చెందుతాయని పవన్ కళ్యాణ్ కాస్త సున్నితంగానే కుదరదని చెప్పేశారు.
అయినప్పటికీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకొని అమిత్ షా ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఏమి చర్చించారో తెలీదు. ఒకవేళ రెండు పార్టీల మద్య పొత్తులు కుదిరి ఉంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ విషయం అక్కడే ప్రకటించి ఉండేవారు కానీ అమిత్ షాతో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ మరెవరినీ కలవకుండా, మీడియాతో మాట్లాడకుండా తిరిగి వచ్చేశారు. అంటే బీజేపీ-జనసేనల మద్య పొత్తులు కుదరలేదని అనుకోవచ్చు.
అయినా ఏపీలోనే కుదరనప్పుడు తెలంగాణలో కుదరగలవని బీజేపీ ఎలా అనుకొందో తెలీదు. నిజానికి బీజేపీ జనసేనతో పొత్తులు కోరుకోవడం లేదు. బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మాత్రమే కోరుకొంటోంది. ఒకవేళ అలా చేస్తే జనసేన రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నట్లే అవుతుంది.
బహుశః అందుకే కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు, బీజేపీకి యస్ లేదా నో అని చెప్పకుండా పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం కుటుంబంతో కలిసి ఇటలీ వెళ్ళిపోయారు. నవంబర్ 1న పెళ్ళి కార్యక్రమం పూర్తవుతుంది. కనుక వెంటనే బయలుదేరితే నవంబర్ 3న నామిషన్స్ వేసేలోగా చేరుకోగలరు.
కానీ బీజేపీతో ఇబ్బంది వద్దనుకొంటే, జనసేన అభ్యర్ధులకు నామినేషన్స్ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, అక్కడే భార్యతో కలిసి ఓ నాలుగైదు రోజులు హాయిగా గడిపిరావచ్చు. కనుక వరుణ్ తేజ్ పెళ్ళి సాకుతో పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా బీజేపీ నుంచి తప్పించుకొన్నారనుకోవచ్చు.




