కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ‘జలజీవన్ మిషన్’ అనే భారీ కార్యక్రమం చేపట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ పధకం అమలుకి నిధులు కేటాయిస్తోంది. దీని ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.37 కోట్ల ఇళ్ళకు మంచి నీటి కనెక్షన్స్ ఇచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్కి కూడా కేంద్రం ఈ పధకం, నిధులు అందించింది. కానీ జగన్ ప్రభుత్వం అన్నిటి లాగే దానినీ దుర్వినియోగం చేసింది. దాదాపు రూ.4,000 కోట్లు వృధా చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పద్ధకాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని, వాటి కోసం రూ.70,000 కోట్లు పనులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులకు నిధులు కోరితే, ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15,000 కోట్ల రుణం ఇప్పించింది. రాష్ట్ర రాజధాని నిర్మాణానికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పు ఇప్పించినప్పుడు, జలజీవన్ మిషన్ కోసం పవన్ కళ్యాణ్ రూ.70,000 కోట్లు అడిగితే ఇచ్చేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.
కానీ ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు, దక్షిణాదిలో బీజేపికి పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఉన్నందున ఎంతో కొంత చేతిలో పెట్టి పంపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం ఎంత ఇచ్చిందనే దాని కంటే, ఇచ్చిన ప్రతీ పైసాని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేయడమే చాలా ముఖ్యం.
సిఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈసారి రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలకు తమ నిబద్దత, సమర్దత నిరూపించి, వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉన్నారు.
ప్రస్తుతం రాజకీయ వాతావరణం కూడా ఇందుకు చాలా అనుకూలంగానే ఉంది. కనుక కేంద్రం సహాయ సహకారాలతో వచ్చే ఎన్నికలలోగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తారనే భావించవచ్చు.






