శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా, మెగాభిమానుల హృదయాలు ఉప్పొంగిపోయేలా జరిగింది. ప్రతీ సినిమాకి ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్, సినీ ప్రముఖుల ప్రసంగాలు, అభిమానుల హడావుడి తప్పక ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో హైలైట్ మాత్రం ముఖ్య అతిధిగా హాజరైన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు.
పవన్ కళ్యాణ్ స్వయంకృషితోనే రాజకీయాలలో ఈ స్థాయికి ఎదిగినప్పటికీ, తన అన్నవదినలు వేసిన పునాదుల మీదే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని సభా ముఖంగా చెప్పుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారానికి నిదర్శనం.
ఆయన వేసిన సినీ పునాది వల్లనే పవన్ కళ్యాణ్ సినిమాలలో రాణించారు. అదే ఆయన రాజకీయాలకు పునాది అని అందరికీ తెలుసు. కనుక తన ఎదుగుదలకు అన్న చిరంజీవే కారణమని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమే.
చిరంజీవి వేసిన ఆ సినీ పునాదులపైనే అల్లు అర్జున్తో సహా మెగా హీరోలందరూ ఈ స్థాయికి చేరుకున్నారని వేరే చెప్పక్కరలేదు. పవన్ కళ్యాణ్ ఇంత నిజాయితీగా సంస్కారవంతంగా ఉంటారు కనుకనే అందరూ ఆయనని ఇంతగా అభిమానిస్తుంటారు.
ఇక వేదికపై బాబాయ్-అబ్బాయ్ ప్రేమాభిమానాలు, చిరంజీవి దంపతుల గురించి చెప్పిన మంచి మాటలు అభిమానులను తప్పకుండా పులకింపజేస్తాయి. కుటుంబంలో అనుబంధాలు ఏవిదంగా ఉండాలో పవన్ కళ్యాణ్ తమ అభిమానులు కూడా తెలుసుకునేలా చేశారని చెప్పవచ్చు.
సినిమా టికెట్స్ రేటు పెంపు నిర్మాతలకు సంబందించిన విషయమే తప్ప సినీ హీరోలకి దీంతో సంబందం లేదని, ఈ పేరుతో సినీ హీరోలని ప్రభుత్వం ముందు సాగిలపడేలా చేయాలనే కుసంస్కారం తమ ప్రభుత్వానికి లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపీ మాజీ సిఎం జగన్కు కూడా పవన్ కళ్యాణ్ చురకలు వేశారు.
ప్రేక్షకుల సొమ్ము బ్లాక్ మార్కెట్కి వెళ్ళే బదులు, టికెట్ ఛార్జీల పెంపుతో జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వస్తుందని, ఏ వస్తువుకైనా ‘డిమాండ్ అండ్ సప్లై’ ప్రకారమే ధరలు ఉంటాయి కనుక సినిమా టికెట్లకి కూడా అదే నియమం వర్తిస్తుందంటూ పవన్ కళ్యాణ్ సమర్ధించుకోవడం కాస్త లౌక్యమే.
గేమ్ చేంజర్, డాకూ మహరాజ్ సినిమాల టికెట్స్ రేటు పెంపుకి, ప్రివిలేజ్, బెనిఫిట్ షోలకి అనుమతిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం, డెప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం, ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని అభిమానుల సమక్షంలో విజ్ఞప్తి చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమని కూడా ఆలోచింపజేశారని చెప్పవచ్చు.
ఒకవేళ సినీ పరిశ్రమ తరలి రాలేకపోయినా సినీ పరిశ్రమలో 24 విభాగాలలో పనిచేస్తున్న దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, ఎడిటర్స్, సాంకేతిక నిపుణులు సినీ పరిశ్రమలో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని యువతకు శిక్షణ తరగతులు నిర్వహించాలనే పవన్ కళ్యాణ్ మరో చక్కటి ప్రతిపాదన చేశారు.
ఇప్పటికే సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో తెలుగు సినీ పరిశ్రమకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. కనుక పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమకి కూడా ఏపీలో చక్కటి ల్యాండింగ్ ఇచ్చారని చెప్పవచ్చు.




