త్వరలో తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో కేరళ, పుదుచ్చేరి తప్ప మిగిలిన మూడు రాష్ట్రాలలో గెలిచి అధికారంలోకి రావాలని బిజేపి చాలా పట్టుదలగా ఉంది.
ముఖ్యంగా మమతా బెనర్జీ కంచుకోటగా మార్చుకున్న పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి బిజేపి చాలా కాలంగానే ప్రయత్నిస్తోంది. అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు.
ఏకంగా 294 అసెంబ్లీ స్థానాలున్నా ఆ ఒక్క రాష్ట్రం బిజేపి చేతికి వస్తే, 2029 సార్వత్రిక ఎన్నికలలో గెలుపుకి మార్గం సుగమం అవుతుంది. కనుక ఈసారి ఎట్టి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో గెలిచి కాషాయజెండా ఎగుర వేయాలని బిజేపి చాల పట్టుదలగా ఉంది. కనుక సిఎం మమతకు మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇక రోజూ అగ్నిపరీక్షలు ఎదుర్కోక తప్పదు.
బెంగాల్ తర్వాత బిజేపి దృష్టి తమిళనాడుపై ఉంది. జయలలిత ఆకస్మిక మరణంతో చకచకా పావులు కదిపి అన్నాడీఎంకేని తన కనుసన్నలలోకి తెచ్చుకోగలిగింది. కానీ అప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికలలో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకేకి తమిళ ప్రజలు మొగ్గు చూపారు.
ఆ తర్వాత అన్నాడీఎంకే నేతల కీచులాటలతో బలహీనపడింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సిఎం పళని స్వామి ఇటీవల డీఎంకేలో చేరిపోవడం పెద్ద షాక్.
ఇలాంటి పరిస్థితులలో కోలీవుడ్ హీరో విజయ్ టీవీకే పార్టీతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. కనుక ఆయనతో పొత్తుకి బిజేపి పలువిధాలుగా ప్రయత్నిస్తోంది కానీ ఆయన ఒప్పుకోవడం లేదు.
కానీ బిజేపి స్పాట్ పెట్టి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అంతటివాడిని చీపురుకట్టతో ఊడ్చిపడేసిందనే విషయం ఆయనకీ తెలుసు. అయినప్పటికీ బింకంగా ఉన్నారు.
కనుక విజయ్ని కూడా నయాన్నో భయాన్నో లొంగదీసుకోవాలని బిజేపి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే సీబీఐ కేసుతో ఆయన, డీఎంకే వలన బిజేపి రెండూ నష్టపోయే అవకాశం ఉంది. కనుక తమిళనాడులో ఈసారి బిజేపి పాగా వేయగలుగుతుందా లేదా? అనేది ఈ పొత్తు మీదే ఆధారపడి ఉంది.
సనాతన ధర్మం, సీబీఐతో బిజేపి అన్ని అస్త్రాలు ప్రయోగించిన కాని ఈ పనిని బహుశః ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సులువుగా చేసి పెట్టగలరనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ని రాయబారానికి పంపితే ఆయన జనసేన ప్రస్తానం-వర్తమానం గురించి నచ్చజెప్తే విజయ్ కాదనలేకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ రావచ్చు. రాజకీయాలలో ఇలాంటి ప్రాక్టికల్ థింకింగ్ చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఈవిషయం విజయ్కి చక్కగా తమిళంలోనే నచ్చజెప్పగలరు.
కనుక విజయ్ మీద బిజేపి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ చెడ్డపేరు మూటగట్టుకునే బదులు, పవన్ కళ్యాణ్ని రాయబారానికి పంపిస్తే మేలేమో?
ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కుదర్చగలిగితే, ఈ పొత్తుతో తమిళనాడు బిజేపి-టీవీకే-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాగలిగితే… అప్పుడు పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారు. ఆయన పరపతి మరింత పెరుగుతుంది. చివరిగా ఒక మాట: సనాతన మార్గంలో తమిళనాడుని జయించడం చాలా కష్టం. కానీ పవనిజంతో జయించడం సాధ్యమే!




