మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తానని ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఇటీవలే పలు సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అది అయ్యే పని కాదని సినీ జనాలు బహిరంగంగానే అంటుండగా, ఇటీవల పవన్ సైతం ఇలాంటి ప్రతిపాదన తన వద్దకు ఏమీ రాలేదని తేల్చిచెప్పారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటివరకు వ్యక్తమైన సందేహాలకు బలం చేకూరినట్లయ్యింది. తాజా పరిణామాలతో ఈ మల్టీస్టారర్ సినిమాపై సుబ్బరామిరెడ్డి మరోసారి స్పందించాల్సి వచ్చింది.
చిరు – పవన్ లతో మల్టీస్టారర్ సినిమా తీసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేస్తున్నారని, ఈ విషయం ఇప్పటికే చిరు, పవన్ లకు తెలుసని, ఇద్దరూ అంగీకారం తెలిపారని, ఈ సినిమాకి అశ్వనీదత్ కూడా నిర్మాతగా ఉంటారని చెప్పారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అధికంగా ఉంటాయని, వాటికి తగిన విధంగానే కథను రెడీ చేస్తున్నామని అన్నారు. అయితే నిజంగా పవన్ కు తెలిస్తే, ‘అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదని ఎందుకు అన్నారు?’ అనేది కీలకంగా మారింది.
ఓ పక్కన సుబ్బిరామిరెడ్డి చెప్తున్న విషయాలకు, జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేకపోవడం మెగా అభిమానులను కలవర పెడుతోంది. నిజానికి ఈ సినిమా కార్యరూపం సిద్ధిస్తుందని వారికి కూడా నమ్మకం లేకపోయినప్పటికీ, సుబ్బిరామిరెడ్డి పదే పదే మీడియా ముందుకు వచ్చి, ఈ మల్టీస్టారర్ ను ఎప్పుడూ వార్తల్లో నిలుపుతున్నారు. అయితే ఇలా ఒక్కొక్కరు ఒక్కోసారి ప్రకటనలు చేసే కన్నా, చిరు – పవన్ లతో కలిసి ఒకేసారి ప్రకటన ఇప్పిస్తే, ఈ గందరగోళానికి తెరపడుతుంది కదా!



