బీజేపికి హిందుత్వ, కాంగ్రెస్కు లౌకికవాదం, బిఆర్ఎస్ తెలంగాణవాదం ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో ‘ట్రేడ్ మార్క్’ ఉంటుంది. అదేవిదంగా వైసీపీలో అందరికీ అవినీతి, దౌర్జన్యాలు ‘ట్రేడ్ మార్క్’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కేవలం వైసీపీ డీఎన్ఏలో మాత్రమే ఇటువంటి అరుదైన లక్షణం చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. అదీ.. అధినేత జగన్ మొదలు ఎంపీపీ కొడుకు వరకు!
ఇందుకు తాజా ఉదాహరణగా అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీ పద్మావతి కుమారుడు, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి కళ్ళ ముందే ఉన్నాడు.
మండల పరిషత్ కార్యాలయంలో తన తల్లి ఛాంబర్ తాళం చెవులు ఇవ్వనందుకు “నాకే ఎదురు చెప్తావా?” అంటూ ఎంపీడీవో జవహార్ బాబుని చితక బాదాడు. ఆ తర్వాత జరిగిన కధ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ఈవిదంగా విర్రవీగితే అర్దం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చిన్న తప్పు చేసినా పోలీసులు కేసు నమోదు చేసి లోపల వేస్తారని తెలిసి ఉన్నా వైసీపీ నేతలు ఈవిదంగా బరీ తెగించడం వారి డీఎన్ఏ లక్షణమని సరిపెట్టుకోలేము.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఆరు నెలల తర్వాత కూడా కాకినాడ పోర్టు వైసీపీ నేతల ఆధీనంలోనే ఉంది. అక్కడి నుంచి రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని సాక్షాత్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనికీలు చేసి పట్టుకున్నా ఏమాత్రం వెరుపు లేకుండా ఆరు నెలలుగా పోర్టు నుంచి పట్టపగలే రేషన్ బియ్యం రవాణా చేస్తూనే ఉన్నారు.
పేర్ని నాని గోదాములలో నుంచి బియ్యం బస్తాలు మాయం అయ్యాయనే విషయం ఆయన చెపితే తప్ప బయటకు పొక్కలేదు. అంటే నేటికీ ప్రభుత్వంలొ అధికారుల మీద వైసీపీ ప్రభావం ఎంతగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి కాకినాడ పోర్టులో తనికీలు చేసిన తర్వాత బాధ్యులైన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహార్ బాబుని పరామర్శించినా కొత్తగా ఒరిగేదేముంటుంది?అనే సందేహం కలుగకమానదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ అవినీతికి, దౌర్జన్యాలకు పాల్పడింది. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఈవిదంగా వ్యవహరిస్తోందంటే ఎవరి తప్పు? వైసీపీదా కూటమి ప్రభుత్వానిదా?
ప్రభుత్వం మారినా వైసీపీ నేతలు ఇంత ధైర్యంగా ఎందుకు రెచ్చిపోతున్నారు?అంటే వారికి కూటమి ప్రభుత్వం భయం పరిచయం చేయకపోవడం వలననే అని భావించవచ్చు.




