చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినప్పుడు ఆయన సూచన మేరకు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తోంది.
ఎంపీగా గెలిస్తే పవన్ కళ్యాణ్కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని మోడీ, అమిత్ షాలు భావిస్తున్నందున లోక్సభకు పోటీ చేయవలసిందిగా కోరిన్నట్లు తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం లేదా మరో నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు లోక్సభకు కూడా పోటీ చేసేందుకు సిద్దమైతే మంచిదా కాదా? అనే చర్చ మొదలైంది.
సానుకూల అంశాలు:
1. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేస్తే దాని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్ధులను గెలిపించుకోవడం సులువు అవుతుంది.
2. కేంద్రంలో మళ్ళీ మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రి పదవి పొందితే, 5 ఏళ్ళుగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సాయపడ గలుగుతారు.
3. పవన్ కళ్యాణ్కి కేంద్రమంత్రి లభించబోతోందని మూడు పార్టీలు ప్రజలకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టిగా చెప్పుకోగలిగితే, జనసేన అన్ని నియోజకవర్గాలలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం.
వ్యతిరేక అంశాలు:
1. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నవారికి, ఇది ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది.
2. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లిపోతే, ఇక్కడ ఏపీలో సంకీర్ణ ప్రభుత్వంలో జనసేనకు సముచిత ప్రాధాన్యత లేకుండా పోతుందని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నవారు అనుమానిస్తే మొదటికే మోసం రావచ్చు.
3. పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతాననే భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, కానీ ఈసారి కూడా ఓడిపోవడం ఖయామని వైసీపి దుష్ప్రచారం చేయకుండా ఉండదు. ప్రజలకు అటువంటి అనుమానం లేదా నమ్మకం కలిగించగలిగితే నష్టపోయేది పవన్ కళ్యాణే.
4. ఉదాహరణకు… తెలంగాణలో తిరుగే లేదనుకున్న కేసీఆర్, శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పుడు, ఆయన ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి. దాంతో ఆయన కామారెడ్డిలో ఆయన ఓడిపోయారు!
5. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరు కానీ ఎంపీగా ఏమీ చేయలేకపోవచ్చు. ఒకవేళ కేంద్రమంత్రి పదవి చేపట్టినా ఎటువంటి ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రం కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకునేందుకు వెంకయ్య నాయుడు ఎదురుగానే ఉన్నారు. పదవి, అధికారం ఉన్నా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేనప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శల పాలవుతారు.
ఏ పార్టీ అధినేత అయినా ఒకే ఒక్క చోట నుంచి పోటీ చేయడం ద్వారా భారీ మెజార్టీతో గెలుస్తామనే ఆత్మవిశ్వాసం, ధీమా వ్యక్తం చేసిన్నట్లవుతుంది. చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. ‘జగన్ వైనాట్ కుప్పం?’ అని చంద్రబాబు నాయుడు ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా, ఆయన ఏమాత్రం అదరక బెదరక కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నారు.
కనుక పవన్ కళ్యాణ్ కూడా అటువంటి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ ఏదో ఒక్క సీటుకే పోటీ చేస్తే, భారీ మెజార్టీతో గెలవగలరు. రాష్ట్ర రాజకీయాలలో యాక్టివ్గా ఉంటేనే, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తనపై చాలా ఆశలు పెట్టుకున్నవారికి తనేమిటో నిరూపించి చూపుకోగలుగుతారు. అయినా మోడీ, అమిత్ షాలు పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి పదవి ఇవ్వాలంటే ఇచ్చి, తర్వాత రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ చేయవచ్చు. మరి ఎంపీ సీటుకి పోటీ చేయడం దేనికి? పార్టీ తరపున మరొకరిని లోక్సభకు పంపే అవకాశం ఉన్నప్పుడు, దానిని పవన్ కళ్యాణ్ చేజెతులా పాడుచేసుకోవడం దేనికి






