జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి షిఫ్ట్ అయిన తర్వాత తీసుకొన్న మొట్ట మొదటి ముఖ్యనిర్ణయం ఏమిటంటే, తెనాలి జనసేన అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించడం. ఆయనను గెలిపించుకొనేందుకు పార్టీ శ్రేణులందరూ ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానులైన జనసేన కార్యకర్తలు దానిని రామాజ్ఞగానే భావిస్తారని వేరే చెప్పక్కరలేదు.
అటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ని సంప్రదించకుండానే టిడిపి అభ్యర్ధులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టిడిపిని సంప్రదించకుండానే తెనాలి అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్ని ప్రకటించడం ద్వారా టిడిపితో పొత్తులు ఉండకపోవచ్చని సంకేతం ఇచ్చిన్నట్లే భావించవచ్చు.
ఒకవేళ ఉన్నా జనసేన బలంగా ఉందని భావిస్తున్న 25-35 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులనే నిలబెడతామని, ఈ విషయంలో తగ్గేదేలే అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేసిన్నట్లే.
వైసీపీ కూడా సరిగ్గా ఇదే కోరుకొంటోంది. టిడిపి, జనసేనలు వేర్వేరుగా పోటీ చేసినట్లయితే ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ధి కలుగుతుందని భావిస్తోంది. అందుకే ఇంతకాలం పవన్ కళ్యాణ్ని టిడిపికి దూరం చేసేందుకు వైసీపీ పవన్ కళ్యాణ్ పదేపదే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అప్పుడు వైసీపీ ఉచ్చుకి చిక్కకుండా తప్పించుకొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వయంగా వెళ్ళి దాని ఉచ్చులో చిక్కుకొంటున్నట్లున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ బిజెపిని నమ్ముకొని రాష్ట్రంలో మళ్ళీ వైసీపీయే అధికారంలోకి వచ్చేందుకు తానే తోడ్పడబోతున్నారా?అని ఆలోచించుకోవడం మంచిది. ఈసారి వైసీపీ గెలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఓడిపోయిన్నట్లే అని చంద్రబాబు నాయుడు ఎందుకన్నారో అందరూ ఆలోచిస్తే మంచిది.



