జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో ప్రెస్ మీట్లు, ట్వీట్ల రాజకీయానికి పరిమితం అయిపోయారు. తాజాగా ఆయన కరోనా బాధితుల కోసం ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేశారు. కరోనా మీద యుద్ధం చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే మరణించిన వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. కరోనా బాధితుల పట్ల పవన్ కు ఉన్న సానుభూతి మంచిదే గానీ… ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే బాధ్యత ఉంటుందా అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
“కరోనా కారణంగా ఆప్తులను కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆసరాగా నిలబడాల్సిందే. అయితే ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు. ఇటువంటి డిమాండ్ తమ మిత్రపక్షమైన కేంద్రంలోని అధికార పక్షాన్ని ఎందుకు అడగరు? కేంద్రానికి ప్రజల మీద బాధ్యత లేదా? ముందు అటువంటి ప్రకటన కేంద్రంతో చేయించాలి,” అని వైఎస్సార్ కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మరణాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. గడచిన ఆరు రోజులలో 258 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి బులెటిన్ ప్రకారం ఒక్క రోజులోనే గరిష్టంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం మరణాలు 586కు చేరుకున్నాయి.





