‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కున్న ఆర్ధిక బాధలు గురించి ఇప్పటికే పలు బహిరంగ సభలలో స్వయంగా పవర్ స్టారే చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాలలో పూర్తిగా ఉండాలని ఉన్నప్పటికీ, పార్టీని నడుపుకోవడానికి తన దగ్గర తగినంత డబ్బు లేదని, అందుకే సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నానని నవ్వుతూ చెప్పేవారు. అయితే ఇందులో పవన్ కాస్త ఎటకారాన్ని జోడించడంతో, అసలు నిజమో, కాదో అన్న అనుమానం తలెత్తేది. ఎందుకంటే తన దగ్గర తినడానికి కూడా లేకపోతే మీ అందరి ఇంటికి వస్తాను, తలో పూట భోజనం పెట్టండి… అన్న డైలాగ్స్ కాస్త ఓవర్ గా ఉన్నాయని అప్పట్లో హల్చల్ చేసిన టాక్.
అయితే ఉన్నట్లుండి మళ్ళీ పవన్ ఆర్ధిక బాధలు ఎందుకు తెరపైకి వచ్చాయి? అంటే అది కూడా మళ్ళీ పవనే స్వయంగా చెప్పారు గనుక! హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్ధులు పవన్ ను కలవడానికి వచ్చిన సమయంలో… మంత్రి నారాయణ కొడుకు డ్రైవ్ చేస్తున్న కారు మీదేనా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా, దానిపై పవన్ ఇచ్చిన వివరణ మరోసారి పవన్ కరెన్సీ కష్టాలను హైలైట్ చేసింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మెర్సిడెజ్ బెంజ్ కారు పవన్ కళ్యాణ్ దేనన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగగా, అదే ప్రశ్నను ఓ విద్యార్థి పవన్ ను నేరుగా ప్రశ్నించాడు.
అయితే ఆ వాహనం తనది కాదు గానీ, అలాంటి వాహనం గతంలో తాను వాడానని, కానీ నెలలవారీ ‘ఇంస్టాల్ మెంట్లు’ కట్టలేక ఆ కారు అమ్మేసానని అన్నారు. అయితే నేను వినియోగించిన వాహనం తదుపరి మోడల్ ను నిషిత్ కొనుగోలు చేసాడని వివరణ ఇచ్చారు. పవన్ ఇచ్చిన సమాధానంతో రెండు విషయాలైతే స్పష్టమయ్యాయి. ఒకటి నిషిత్ వాహనం పవన్ ది కాదని, మరొకటి వాయిదాలు కట్టలేని ఆర్ధిక బాధల్లో పవన్ ఉన్నారని! అయితే పవన్ నుండి ఆ సమాధానం వచ్చిన సమయంలో, విద్యార్ధులు కూడా గొల్లున నవ్వారంటే… పవన్ చెప్పిన జవాబు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..!



