జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పార్టీ సమావేశానికి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పలేదు. ఆ అవసరం కూడా లేదు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు అని ఆ పార్టీ దాని అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగానే చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లు తెలంగాణ శాసనసభ, మున్సిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేసింది కనుక ఈ సమావేశమేమీ అసాధారణం కానే కాదు.
కానీ అందరూ కలిసి జూన్ 2న సమావేశం పెట్టడం తప్పని తేల్చేశారు. కానీ ఆయన ఆ తప్పు చేయకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ పెట్టి మాట్లాడేసి అంతకంటే ఇంకా పెద్ద తప్పు చేసేశారు.
కనుక అందరూ కలిసి ఆయనపై విరుచుకుపడ్డారు. ఇంకా పడ్తూనే ఉన్నారు. పడక తప్పదు. దేనికంటే ఎవరి లెక్కలు వారికున్నాయి కనుక.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. రేవంత్ రెడ్డిని ఎంత తిట్టిపోస్తున్నా, చంద్రబాబు నాయుడు పేరుతో ఎంతగా రాజకీయాలు చేస్తున్నా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
మరోపక్క కల్వకుంట్ల కవిత చెవిలో జోరీగలా నస పెడుతూనే ఉన్నారు. కానీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తండ్రి కేసీఆర్ని కూడా మరమనిషి అంటూ విమర్శిస్తున్నారు.
ఒకప్పుడు ఎన్నికలంటే బీఆర్ఎస్ పార్టీకి ఆట. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినా గుండె దడ మొదలవుతుంది. పార్టీ పరిస్థితి ఇలా ఉన్నా కేసీఆర్ ఫామ్హౌసు విడిచి బయటకు రావడం లేదు.
ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ ఆపద్భాందవుడులా వచ్చి ప్రెస్మీట్ పెట్టి ఓ నెలరోజులకు సరిపోయే రాజకీయ ఆహారం ఇచ్చి వెళ్ళిపోయారు. కనుక కేటీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఆ ఆహారాన్ని నమలడం మొదలుపెట్టారు.
దీంతో ఓ నెలరోజులు కాలక్షేపం చేసేయగలిగితే ఆ లోగా మరేదో హాట్ టాపిక్ లభిస్తుంది. కనుక తమకు నోటి నిండా పని కల్పించినందుకు బీఆర్ఎస్ పార్టీ పవన్ కళ్యాణ్కి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. కానీ తిట్టిపోస్తున్నారు!
కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే, సిఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రతీరోజూ సన్నాసి, ఔలాగాడు, బేవకూఫ్ అంటూ తిడుతూనే ఉన్నారు. ఆ తిట్లు భరించడం చాలా కష్టంగా ఉంటోంది. పైగా ప్రభుత్వం ఏం చేసినా, చేస్తున్నా కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసినట్లు లోపాలు వెతికి పట్టుకొని విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి రోజూ నిలదీస్తూనే ఉన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ తర్వాత కేటీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ రేవంత్ రెడ్డిమో విడిచిపెట్టి ఆయనపై పడ్డారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఊపిరి తీసుకోగలుగుతోంది. కనుక సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్కి థాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ నేతల వెటకారపు మాటలతో ఆంధ్రా ప్రజల మనసులు గాయపడుతూనే ఉన్నాయి. కనుక వారి మనసులో భావాలను పవన్ కళ్యాణ్ నోటితో వినిపించారు కనుక ఆంధ్రా ప్రజలు కూడా ఆయనకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే.
ఇక ఏపీలో వైసీపీ సొంత మీడియా, దాని సైన్యం కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ తర్వాత చాలా బిజీ అయిపోయిది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ని ఎవరెవరు ఎన్ని తిట్లు తిడుతున్నారో? ఏవిధంగా తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద తప్పు చేశారో పుంఖాను పుంఖాలుగా వ్రాసి పడేస్తూనే ఉంది. కనుక ఇంత పని ఇచ్చినందుకు వైసీపీ మీడియా కూడా పవన్ కళ్యాణ్కి థాంక్స్ చెప్పుకోవాల్సిందే.




