ఇటీవల శాసనసభ సమావేశాలలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఇతర మతాలలో ఏదైనా ఓ సమస్య వస్తే వెంటనే ఆయా మతాల ప్రజలు భాషలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా ముక్తకంఠంతో పోరాడుతారు. కానీ హిందువులందరికీ ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు తెలిసినా, అందరూ కులాల వారీగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు,” అని అన్నారు.
ఇందుకు నిదర్శనంగా, ఈ వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇరాన్ అధినేత అలీ ఖమైనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు మట్టుపెట్టడం, ఇరాన్ మీద దాడులు చేయడాన్ని నిరసిస్తూ, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్తో సహా దేశ విదేశాలలో ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఫోటోలు, వీడియోలు, న్యూస్ ఛానల్ క్లిపింగ్స్ పెట్టారు. ముస్లింలు, క్రీస్టియన్లలో ఇటువంటి ఐఖ్యత కనిపిస్తుంది. కానీనీ హిందువులలో కనిపించదని పేర్కొన్నారు. ఇది వాస్తవం కూడా.
హిందూమతానికి సంబంధించి ఏ అంశం, సమస్య, వివాదంపైనైనా ముందుగా హిందూమతానికి చెందినవారే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలలో పార్టీలు, కులాల వారీగా కూడా చీలికలున్నాయి. పార్టీల నాయకులు ప్రజలను ఆవిధంగా ట్యూన్ చేయడం వలననే అందుకు అనుగుణంగా స్పందిస్తుంటారు తప్ప వాస్తవాలను పట్టించుకోరు.
హిందువులలో ఈ అనైక్యత ఉంది కనుక కొన్ని పార్టీలు, కొందరు నాయకులు ఇలాంటి వివాదాలు, విమర్శలు, ఆలయాలలో అపచారాలు, అన్యమత ప్రచారాలు చేయగలుగుతున్నారు. మత మార్పిడులతో హిందూమతాన్ని దెబ్బ తీయాలని కొందరు విఫలయత్నాలు చేస్తుంటారు.
కానీ హిందూమతంలో చేరాలని ఎవరూ ఎవరినీ కోరరు. దాని గొప్పదనం గుర్తించిన అనేక మంది విదేశీయులు స్వచ్చందంగా హిందూమతంలో చేరుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న అన్యమతాల పరిస్థితిని నిశితంగా గమనిస్తే, వాటిలోకి మన కులాలు, హిందూ ఆచారాలు, సాంప్రదాయాలు చాప కింద నీరులా విస్తరించి అమలవుతున్నాయి కదా? అంటే అర్థం ఏమిటి?
కానీ హిందూమతం ఇన్ని ఆటుపోట్లకు గురవుతున్నా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది కదా? కనుక హిందూమతం విషయంలో హిందువుల అనైక్యత కూడా దానిని ఏమీ చేయలేదు.
హిందూమతం అందరికీ కావాల్సినంత స్వేచ్చ, భావ ప్రకటన స్వేచ్చని కల్పించే ఓ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ వంటిదని కూడా చెప్పవచ్చు. కనుక ఇలాంటి ఆటుపోట్లను తట్టుకొని నిలబడగల శక్తి హిందూమతానికి ఉంది.




