బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాజకీయాలు పవన్ కళ్యాణ్ తరువాతి అడుగు గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. కేంద్ర సాయం గురించి నిర్ధారించడానికి పవన్ కళ్యాణ్ వేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను ఒక ప్రత్యేక నివేదిక రూపంలో అందచేసింది.
కేంద్ర ప్రభుత్వ వాదన గురించి జనసేన ఒక ఆర్టీఐ అప్లికేషన్ పంపింది. అటు నుండి వివరాలు రావాల్సిందిగా తెలుస్తుంది. తాను ఢిల్లీలో తదుపరి కార్యాచరణకు దిగుతానని ఆయన ఒక వార్త పత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీలో ఆందోళన కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.
తన చిత్తశుద్దిని ఎవరూ శంకించజాలరని, ఎపి ప్రజా సమస్యల విషయంలో తాను రాజీపడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు కులపరమైన రాజకీయాలు చేస్తున్నాయని, తన ఇమేజీని దెబ్బతీసే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను తెరచిన పుస్తకం అని తన రాజకీయ వేదిక ద్వారా ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.



