జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్లో మణికొండ వద్ద పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ ఉద్యమాలు, భాష, యాస, సంస్కృతి పట్ల తనకు చాలా గౌరవం ఉందన్నారు. ఆ స్పూర్తిని జనసేన-తెలంగాణ కొనసాగిస్తుందన్నారు. తెలంగాణకి సంబంధించి ప్రతీ అంశాన్ని గౌరవిస్తూనే జాతీయ దృక్పదంతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
సాధారణంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కనుక పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాలు ప్రారంభించారు.
బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ హయంలో దేవతామూర్తి రూపంలో రూపొందించిన విగ్రహాలను అసలు సిసలైన తెలంగాణ తల్లిగా భావిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాదరణ మహిళకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆ తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తామని కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఇద్దరూ చెప్పారు. ఈ విషయంలో వాటి వైఖరి స్పష్టంగానే ఉంది.
కనుక జనసేన-తెలంగాణ వాటిలో ఏ విగ్రహాన్ని ఎంచుకోవాలి? ఎంచుకుంటుంది? అనే సందిగ్ధం ఏర్పడటం సహజం. కానీ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి చిత్ర పటానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి, పార్టీ కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఆ సందిగ్దత తొలగించారు.
పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తున్నప్పుడు, జనసేన పార్టీ తెలంగాణ ప్రజల ఆదరణ పొందడం చాలా కష్టం.
ఇదివరకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులలోనే ప్రజల విశ్వసనీయత సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరూ తెలంగాణకు చెందిన వ్యక్తులు కావడం, వారిని ప్రజలు కూడా తమవారిగా భావించడం వలన రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.
కానీ ఇప్పటికే జనసేనపై ‘ఆంధ్రా పార్టీ’ ముద్ర వేసేశారు కనుక దానిని తొలగించుకునేందుకు గాను జనసేన-తెలంగాణ పార్టీ కూర్పు, కార్యాచరణ, విధానాలు అన్నీ కూడా ఆవిధంగా జరిగితేనే ప్రజల నమ్మకం పొందగలుగుతుంది.



