నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని కాజా గ్రామ సమీపంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన సొంత ఇంటి నిర్మాణానికి ఈ ఉదయం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ జరిపించారు. తన భార్య అన్నా లెజినోవా, ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఆయన, హోమ క్రతువును తానొక్కరే పూర్తి చేశారు. రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక హంగులతో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలన్నది పవన్ అభిమతం.
చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్థుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పని వారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్ లో మరో చిన్న మీటింగ్ హాల్ తో పాటు కిచెన్, డైనింగ్ హాల్, బెడ్ రూములు తదితరాలు ఉంటాయని, ఆపై అంతస్థులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి, మిగతాదంతా ఖాళీగానే ఉంచాలని పవన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన కారణాన్ని మీడియాకు వివరించారు పవన్ కళ్యాణ్. తన రాజకీయ ప్రయాణంలో కీలక సమయం ఆసన్నమైందని… ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని తలపెట్టానని అన్నారు. అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.



