ప్రతి ఏటా మార్చి నెల రెండో గురువారం నాడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి 9వ తేదీ ఇందుకు వేదిక అయ్యింది. ఈ నేపథ్యంలో ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఈ కిడ్నీ దినోత్సవంపై తన భావాలను వ్యక్తపరుస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గత 21 సంవత్సరాలుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఏం సాధించామని ప్రశ్నించారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ తరుణంలో ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని కూకటి వేళ్లతో పెకలించాలని, ఈ ప్రాంతంలోని 120 గ్రామాల్లో 50 వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని, ఈ రోగం బారిన ఎందుకు పడ్డామో కారణం ఏమిటో తెలియన అమాయక ప్రజలు బాధ పడుతుంటే, అందుకు కారణం తెలిసిన ప్రజా ప్రతినిధులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని పవన్ మండిపడ్డారు.
ఈ వ్యాధి బారిన పడ్డ పేదలు, నెలకు 8 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇంత స్తోమతతో వైద్యం చేయించుకునే అవకాశం పేద ప్రజలకు ఉండదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు స్పందించిన ప్రభుత్వం, తక్షణం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తన ప్రకటనలో కోరారు పవన్. అన్ని విషయాల మాదిరి కాకుండా, ఉద్దానం కిడ్నీ బాధితుల విషయాన్ని మాత్రం పవన్ వదిలిపెట్టకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు.



