అధికార తెలుగుదేశం పార్టీపై జనసేన పవన్ కళ్యాణ్ చేస్తోన్న దండయాత్రకు సంబంధించిన తెరవెనుక కధ, కమామీషు ఏమిటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ పవన్ ఆశించినట్లుగా రాజ్యసభ సీటు దక్కి ఉంటే, ప్రస్తుతం టిడిపిపై చేస్తోన్న విమర్శలన్నీ పొగడ్తలుగా మారిపోయేవా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. అసలు మొన్నటివరకు అధికారమే వద్దన్న పవన్ కు ఈ స్థాయిలో అధికారం కావాలన్న తపన ఎలా వచ్చింది? అన్నది మాత్రం శేషప్రశ్నగా మిగిలిపోయింది.
రాజకీయాలను సమూలంగా మారుస్తానని, 25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానానికి లోబడి తాను పార్టీని పెట్టానని పవన్ చెప్పినపుడు… అందులో వాస్తవికత కనపడింది. ఎందుకంటే… ఇవాళ పార్టీ పెట్టి, రేపు మార్చేస్తాను అంటే నమ్మే జనులేవరూ లేరు. దీంతో పవన్ భావజాలం సరైనదేనని విమర్శకులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఒక్కసారిగా అధికార దాహం రావడానికి తెరవెనుక ఉన్న వారెవరూ? లేదంటే పవన్ అసలు వ్యక్తిత్వం ఇదేనా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాకపోయినా రేపు ప్రత్యర్ధుల నుండైనా పవన్ ఎదుర్కోక తప్పదు.
కేంద్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని విస్మరించడం, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలలో అవినీతి పేరుకుపోయిందని చవకబారు ప్రకటనలు చేస్తే… అందులో పవన్ స్పెషాలిటీ ఏముంటుంది? ఇలాంటి ఆరోపణలు, ప్రకటనలు చేయడానికి బోలెడుమంది రాజకీయ వేత్తలు మీడియా మైక్ లు పట్టుకుని పొద్దుగూకులు ప్రసంగాలు ఇస్తుంటారు. ఈ కనీస వైవిధ్యం కూడా చూపించకుండా అదే పనిగా విమర్శిస్తే… ఓట్లు రాలతాయనుకోవడం అవివేకమే అవుతుంది.
ఎందుకంటే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన ఇంతకంటే పెద్ద స్థాయిలోనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ… కళ్ళు తాగి ఊగిపోయారు. మరి ఆ స్థాయిలోనే విమర్శలు చేసినపుడు ప్రజలు తిప్పికొడితే, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పును చేయడం… సరికొత్త రాజకీయాలకు నాంది అనుకోవాలా?! అధికారం కోసం చిల్లర రాజకీయాలు చేయడం నిజంగా జనసేన అధినేత నుండి ఊహించనిది కాదు, అందుకే ప్రతివిమర్శలు కూడా అదే స్థాయిలో వెలువడుతున్నాయి.



