జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న విశాఖలో నిర్వహించిన జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
“నేను ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని ఇదివరకు పిఠాపురంలో చెప్పాను మళ్ళీ మొన్న గాజువాక సభలో కూడా చెప్పాను. ఒక జర్నలిస్ట్ లేదా ఓ వైద్యుడు లేదా మరో రంగంలోనివారికి తమ వృత్తిలో పూర్తి అవగాహన, నైపుణ్యం సాధించాలంటే కనీసం ఓ 5-10 ఏళ్ళు ఆ రంగంలో పనిచేసి ఉండాలి.
అదేవిదంగా నేను కూడా రాజకీయాలలో రాణించడానికి గత పదేళ్ళుగా శ్రమిస్తూనే ఉన్నాను. ఈ పదేళ్ళలో రాజకీయాలు, ప్రజా సమస్యలు, పాలనా సంబంద విషయాలపై నాకు పూర్తి అవగాహన ఏర్పడింది. కనుకనే నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హుడినని భావించి సంసిద్దతను వ్యక్తం చేశాను.
అయితే నా సంసిద్దత ఒకటే సరిపోదు. అందుకు ప్రజల మద్దతు కూడా అవసరం. ప్రజలు నాపై నమ్మకం ఉంచి మా ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపిస్తేనే ఇది సాధ్యపడుతుంది.
అమెరికాలో పార్టీలకు బదులు అవి నిలబెట్టిన వ్యక్తులను చూసే జనం తమ అధ్యక్షుడుని నేరుగా ఎన్నుకొంటారు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకొంటే వారు ముఖ్యమంత్రిని ఎన్నుకొంటారు. అంటే ప్రజలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్ధులపై పూర్తి నమ్మకం ఏర్పడాలన్న మాట.
నేను నా వంతుగా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నాను. కనుక జనసేన తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకొంటున్నవారు కూడా ప్రజల నమ్మకాన్ని పొందేందుకు గట్టిగా కృషి చేయాలి.
ఎన్నిక తర్వాత కూడా జనసేన-బిజెపి కూటమి వస్తుందా లేదా జనసేన-బిజెపి-టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందా?అనేదానిని బట్టి కూడా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది నిర్ణయం అవుతుంది. జనసేన-బిజెపిలు కలిసి పోటీ చేయడం ఖాయమే. మాతో టిడిపి కూడా కలుస్తుందా లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమని, రాష్ట్రంలో అరాచక, అవినీతి, అసమర్ద పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఖాయమని నేను హామీ ఇస్తున్నాను.
మేము అధికారంలోకి రాగానే ఇన్నేళ్ళుగా అవినీతికి పాల్పడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వారికి సహకరించిన అధికారులు అందరినీ వారి తప్పులకు బాధ్యులుగా చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొంటాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



