మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ సినిమాలో చిరంజీవి, శ్రుతీహాసన్ల మీద విదేశంలో చిత్రీకరించిన “నువ్వు శ్రీదేవివైతే… నేను చిరంజీవినంటా…” అంటూ సాగే ఎంత హిట్ అయ్యిందంటే అప్పుడే రాజకీయనాయకులు కూడా దానిని తమకి అన్వయించేసుకొని వాడేసుకొంటున్నారు.
గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధ్వర్యంలో జరిగిన యువశక్తి సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశ్యించి, “ఆయనకి తన శాఖ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కనుక రాష్ట్ర ప్రజలని రంజింపజేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనని తన మంత్రివర్గంలో జోకర్గా నియమించుకొన్నారు. ఆయనో సంబరాల రాంబాబు,” అని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ మంత్రి అంబటిని అంత మాట అనేయడానికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. మంత్రి అంబటి సంక్రాంతి పండుగ సందర్భంగా తన సత్తెనపల్లి నియోజకవర్గంలో ‘లక్కీడ్రా’లు నిర్వహిస్తూ ప్రజలకి ఆ టికెట్లు అంటగట్టి బలవంతంగా డబ్బు వసూలు చేయిస్తున్నారు. దీనిపై జనసేన నేతలు వేసిన పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయమని సత్తెనపల్లి పోలీసులని ఆదేశించింది కూడా!
పవన్ కళ్యాణ్ తనని ఇంతమాట అనేశారు కనుక ఆయన వాల్తేర్ వీరయ్య సినిమాలోని “నువ్వు శ్రీదేవివైతే… నేను చిరంజీవినంటా…” అనే ఆ పాటని స్పూర్తిగా తీసుకొని “నేను సంబరాల రాంబాబునైతే…. నువ్వు కళ్యాణాల పవన్వి…” అంటూ వెంటనే ట్వీట్ చేశారు.
అంతేకాదు… మరో మంత్రి రోజాపై కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో దానిపై కూడా స్పందిస్తూ, “రోజా డైమండ్ రాణి అయితే… నువ్వు బాబుగారి జోకర్వి…” అంటూ మరో ట్వీటేశారు.
కనుక సినీ గేయ, మాటల రచయితలు ఇకపై రాజకీయ నాయకులు సులువుగా వాడుకొనేందుకు వీలుగా ఇటువాని పాటలు, డైలాగ్స్ వ్రాస్తే సినిమాలు వెళ్ళిపోయినా అవి రాజకీయ నాయకుల నోళ్ళలో ఈవిదంగా చాలాకాలం నిలుస్తూ వారికి మంచి పేరు, గుర్తింపు తెస్తాయి.



