నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూవీ లో చెప్పే ఈ డైలాగ్ ఆయన అభిమానులకు మంచి జోష్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ పవన్ రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో చెప్పాలనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీని భవిష్యత్ తరానికి మరింత దగ్గర చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ముందు నుంచి జనసేన బలోపేతానికి ఆయువు పట్టుగా ఉన్న యువతను అలానే ఉంచుతూ ప్రస్తుత జెన్ – జీ తరాన్ని తన వైపుకు తిప్పుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అందుకుగాను ‘సేనాగళం’ పేరిట ఒక సోషల్ మీడియా దళాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు పవన్. ప్రస్తుతం తరం వారు మూసపోయిన పాతకాలం నాటి రాజకీయానికి దూరంగా ఉంటున్నారు. భారీ భారీ ప్రసంగాలు, వేలమంది తో బహిరంగ సభలు ఇటువంటి వాటికీ నేటితరం యువత పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఏదైనా అంశాన్ని కట్టే కొట్టే తెచ్చే అనేలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండే వాటికే ఆకర్షితులవుతున్నారు. ఇందుకు యు ట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్ పెరిగిన ఆదరణే ఉదాహరణలుగా చెప్పొచ్చు. అలాగే క్రికెట్ విషయానికొస్తే ఒకప్పుడు క్రికెట్ అంటే ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ కనిపించేది కానీ తరువాత వన్ డే క్రికెట్ టెస్ట్ క్రెజ్ ని అమాంతం తగ్గించింది.
ఇక టీ – 20 లు పరిచమయ్యాక వన్ డే ఆట కూడా బోరింగ్ అన్నట్టుగా ప్రేక్షుడి మైండ్ సెట్ అయిపొయింది. ప్రస్తుత తరం జెన్ – జీ లు టీ – 20 ల మీద చూపించే ఆసక్తి వన్ డే మ్యాచ్ ల పై చూపించలేకపోతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు అన్ని రంగాలు ట్రెండ్ కి అతగ్గట్టు అప్ డేట్ అవుతూ జెన్ – జీ లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పుడు ఈ జెన్ జీ ల ప్రభావం రాజకీయాన్ని తాకుతుంది. ఒక దేశ రాజకీయాలను జెన్ జీ లు తారుమారు చేస్తున్న ఘటనలు, సందర్భాలు అంతర్జాతీయ రాజకీయాలలో చూస్తున్నాం. పొరుగు రాష్ట్రాలలో గమనిస్తున్నాం. నేటి సోషల్ మీడియా యుగంలో యువత నుంచి జెన్ – జీ ల వరకు అందరు తమ సమయాన్ని సోషల్ మీడియా కొరకే ఎక్కువగా వెచ్చిస్తున్నారు.
ఒక ఆర్గనైజింగ్ పద్దతిలో సోషల్ మీడియా లో జరిగే ప్రచారాలు ఏ స్థాయి ఫలితాలను అందిస్తాయి అన్నదానికి తాజాగా తమిళనాడులో విజయ్ టీవీకే విజయమే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. తమిళనాట సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న విజయ్ తన అభిమాన సంఘాల బలాన్ని, ప్రజలలో తనకున్న సినీ చరిష్మాను సోషల్ మీడియా సాయంతో తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు.
దీనితో పవన్ కు కూడా సినీ అభిమాన బలం దండిగానే ఉంది, దానికి తోడు దశాబ్దాల రాజకీయ పోరాటాలు జనసేనకు యువతలో ఒక బలమైన ఓటు బ్యాంకు గా మారుతుంది. ఇక ఇప్పుడు పవన్ తరువాత తరం ఓటర్లను కూడా తన వైపుకి ఆకర్షించుకోగలిగితే, తన పార్టీ జనసేనకు ఓటర్లుగా మార్చగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ మరోకొత్త ట్రెండ్ ను సృష్టించినవారవుతారు.
పవన్ ఏర్పాటు చేస్తున్న సేనాగళం తో జనసేన సోషల్ మీడియా బలాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా ద్వారా పార్టీకి రీల్స్, మీమ్స్, షార్ట్స్, ఇన్ఫ్రోగ్రఫీ ద్వారా తమ పార్టీ భావజాలాన్ని, తన సిద్ధాంతాలను నేటితరం జెన్ జీ లకు అర్ధమయ్యే విధంగా ప్రచారం చెయ్యడమే పవన్ ఉద్దేశంగా కనిపిస్తుంది.
పవన్ తన పార్టీ బలోపేతానికి తీసుకున్న ఈ నిర్ణయం సానుకూల ఫలితాలను అందిస్తే జనసేన రాజకీయ భవిష్యత్ కు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇదొక గేమ్ ఛేంజర్ కావచ్చు.
సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’..! pic.twitter.com/Hr0YKryXvV
— JanaSena Party (@JanaSenaParty) May 31, 2026




