వైసీపీ అధికారానికి దూరమైన నాటి నుంచి నేటి వరకు తిరిగి ఆ అధికారాన్ని ఎలా దక్కించుకోవాలి అనే ఆలోచనలో రాజకీయం చేస్తుందే కానీ అసలు ఇంత ఘోర ఓటమి ఎందుకు ఎదురయ్యింది అనే విశ్లేషణ చేయలేకపోతోంది.
అయితే టీడీపీ, జనసేన రెండు పార్టీల పొత్తు వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అనే దాని మీద ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చిన వైసీపీ ఇక ఆరెండు పార్టీల మధ్య విబేధాల సృష్టి కోసం అనేక రాజకీయ కుయుక్తులను ప్రయోగించింది, ఇక ముందు కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటుంది.
అయితే వైసీపీ నేతల ఆశల పై, అధికార ఆరాటం పై నేడు పవన్ నీళ్లు చల్లారనే చెప్పాలి. వ్యక్తిగత పదవుల కోసమో, పార్టీల అధికారం కోసమో కూటమి బంధం ఏర్పడలేదు. ఈ కూటమి రాష్ట్ర ప్రయోజనం కోసం, ఏపీ ప్రజల ప్రగతి కోసం సృష్టించబడింది. ఇందులో వచ్చే చిన్న చిన్న అభిప్రాయం బేధాలు కానీ, నాయకుల ఆలోచన శైలిలో వచ్చే మార్పులు కానీ అది కూటమి కుటుంబ వ్యవహారం.
కిందపడతాం, మీదపడతాం, తిట్టుకుంటాం…అలాగే ఎవరైనా గౌరవ సభ్యులు నా పై ఏదైనా విమర్శ చేసినా కానీ, ఇబ్బందిపడ్డా కానీ చివరికి రాష్ట్రం కోసం కలిసే ఉంటాం. మరో 15 ఏళ్ళు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది అంటూ పవన్ అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు.
పవన్ ఇచ్చిన ఈ హామీతో వైసీపీ చేస్తున్న ‘కూటమి విచ్ఛిన్నం’ అనే విష ప్రచారానికి విరుగుడు వేసినట్లయ్యింది. లోకేష్ డిప్యూటీ సీఎం వివాదం మొదలుకుని, అనిత పై పవన్ విమర్శలు….వరకు వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. ఇక కూటమి బంధానికి బీటలు పడ్డాయి…మూన్నాళ్ళ ముచ్చటగా కూటమి బంధం అంటూ నీలి మీడియాలో గాలి వార్తలెన్నో ప్రచారం చేసారు.
అయితే నేటితో ఇక పై వైసీపీ ఎన్ని గాలి వార్తలు సృష్టించినా, కూటమి బంధం మీద నీలి మీడియా ఎంత విషం చిమ్మినా అవి వైసీపీ ఆశలకు జీవం పోయలేదని స్పష్టమయింది. గతంలో కూడా పవన్ ఇదే మాదిరి ‘వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను’ అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు, అలాగే తానిచ్చిన హామీ కోసం 21 సీట్లకు పరిమితమై కూటమి బంధాన్ని నిలబెట్టారు, వైసీపీ కోటలు బద్దలుకొట్టారు.
అయితే అప్పుడు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోని వైసీపీ, జనసేన పార్టీని గేలి చేస్తూ పవన్ ను కించపరిచి ఇప్పుడు దాని ప్రతిఫలం అనుభవిస్తుంది. అలాగే ఇప్పుడు కూడా మరో 15 ఏళ్ళు కూటమి బంధాన్ని చిలనివ్వను అంటూ పవన్ అసెంబ్లీ వేదికగా ప్రజలకు హామీ ఇచ్చారు.
మరి ఈ హామీ కోసం పవన్ కూటమి పార్టీల మధ్య ఏర్పడే ఎన్ని వివాదాలనైనా భరించి ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మరోమారు వైసీపీ కి అధికారం అందకూడదు అనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తుంది.




