‘జనసేన’ పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదని… ‘ప్రజా శ్రేయస్సు’ అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును, ఇమేజ్ ను ప్రజాసేవ కోసమే ఖర్చు చేస్తానని తెలిపారు. అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో మీట్ అండ్ గ్రీట్ కు హాజరైన సందర్భంగా పవర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు దెబ్బ తినడం మాత్రమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తెలుసని, యువ రాజకీయ నేతలు అంటే రాజకీయ వారసులు కాదని… సామాన్య ప్రజల్లో నుంచి కొత్త తరం రావాలని తెలిపారు.
సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యవంతంగా ఫీల్ కాలేదని, ప్రజల సమస్యలపై పోరాటమే తనకు అంతులేని తృప్తిని ఇచ్చిందని అన్నారు. రాజకీయాల పట్ల తనకు పూర్తిగా అవగాహన లేదని… కానీ, సమాజాన్ని చదవడం, ప్రజా సమస్యల పట్ల స్పందించే అలవాటు మాత్రం తనకు ఉందని చెప్పారు. అన్యాయాన్ని చూస్తూ తాను కూర్చోలేనని, కుల రాజకీయాలు తనకు నచ్చవని, అలాంటి రాజకీయాలు చేసేవారు కూడా తనకు నచ్చరని స్పష్టం చేశారు. అలాగే పార్టీకి వస్తున్న ఫండ్స్ ను కూడా తానూ ఎందుకు తీసుకోవడం లేదో చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ప్రతి రూపాయి ఎలా ఖర్చు అయ్యేలా పారదర్శకత వచ్చిన రోజున, పార్టీ ఫండ్స్ ను స్వీకరిస్తానేమో గానీ, అప్పటివరకు మాగ్జిమమ్ తీసుకోనని, పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నానని పవర్ స్టార్ అన్నారు. చాలా మంది డబ్బులు ఇస్తానంటున్నారు, కానీ అవి మిస్ యుజ్ అవుతాయని, వీలైనంత వరకు సొంత డబ్బులతోనే పార్టీని నడుపుతాను, ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తాను… అంటూ స్పూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ మాటలతో పవన్ వ్యక్తిత్వం ఏమిటో మరోసారి తెలిసి వచ్చిందంటూ పవన్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.



