‘సింపతీ’ అనేది రాజకీయాలలో వర్కౌట్ అయ్యే ప్రధానమైన అంశం. గత ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చినా, అది సింపతీ పుణ్యమే అనుకోవాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన ఆదరణను ఓట్లు మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు జగన్. అలాగే ఎన్నో సందర్భాలలో సింపతీ ఓట్లతో అధికార పగ్గాలు చేపట్టిన ట్రాక్ రికార్డ్ ఇండియన్ పాలిటిక్స్ లో ఉన్నాయి.
[m9ad]
ఈ సారి జనసేన అధినేత కూడా అదే సింపతీతో నెట్టుకురావాలని ప్రయత్నిస్తున్నారో ఏమో గానీ, ప్రజలలో సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోంది. “డిప్రెషన్ లో ఉన్నపుడు విడివిడి సందర్భాలలో తాను రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడబోయానని” అని చెప్తూ, దాని నుండి ఎలా బయటపడ్డానో కూడా పవన్ తాజాగా ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు.
పవన్ చెప్తున్నంత సేపు అంతా ఆసక్తిగా విన్నారు గానీ, దాని వలన ప్రజలలో పవన్ పట్ల నెగటివ్ భావమే కలుగుతుంది తప్ప, సింపతీ గానీ, ఓట్లు వేయాలన్న ఆలోచన గానీ కలుగదని విశ్లేషణ చేసుకోవాలి. ఓ నాయకుడు అనే వాడు ఎంతో నిబ్బరంగా, మనోస్త్యైర్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు గానీ, ఇలా డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నాలు చేయాలని కోరుకోరు.
జనసేన అధినేత చెప్పుకొచ్చింది ఫ్లాష్ బ్యాక్ లోని అంశమే అయినా, అసలు అలాంటి ఆలోచనలు రావడమే ఒక మానసిక రోగంగా డాక్టర్లు చెప్తుంటారు. అందులోనూ పవన్ నిత్యం ప్రజల మధ్యలో ఉండరు. ఎప్పుడూ పుస్తకాలు అంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. బహుశా ఒక హీరోగా ఇలాంటి మాటలు చెప్తే చెల్లుబాటు అవుతాయోమో గానీ, ఒక రాజకీయ నాయకుడిగా, అందులోనూ పార్టీ అధినేత స్థాయిలో ఉండి చెప్తే అది చేసే మంచి కన్నా, చెడె ఎక్కువగా ఉంటుంది.



