జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత నారా లోకేష్, బాలకృష్ణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం కాదు ఏకంగా బాంబుల వర్షమే కురిపించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఇప్పుడు ఓ పరిపూర్ణ పరిపక్వ రాజకీయ నాయకుడని ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ మీడియా సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ఆ వివరాలు క్లుప్తంగా..
1. బిల్ గేట్స్ వంటి ప్రముఖులతో కూర్చొని మాట్లాడి హైదరాబాద్కు రప్పించి ఐటి కంపెనీలు ఏర్పాటు చేయించిన ఓ గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనపై రాజకీయ కక్షతో జగన్ ఈ జైల్లో కూర్చోబెట్టడం నాకు చాలా బాధ కలిగిస్తోంది.
2. ఇక నుంచి టిడిపి, జనసేన పార్టీలు కలిసే పనిచేస్తాయి. ఎన్నికలలో కలిసే పోటీ చేస్తాయి. బీజేపీ కూడా తప్పకుండా మాతో కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను.
3. సింహం సింగిల్గా వస్తుందనే వైసీపి నేతలని ఉద్దేశించి “మేము మీలాగ జంతువులం కాము సాధారణ మానవులం. కనుకనే కలిసే తిరుగుతాము. కలిసే పోటీ చేస్తాము. మేము పొత్తులు పెట్టుకొంటే మీకెందుకు అభ్యంతరం?మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకెందుకు? మేము ఏనాదైనా జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చెప్పామా?
4. అసలు ఇంత మెజార్టీ ఉన్న జగన్ సక్రమంగా పరిపాలిస్తే నేను రాజకీయాలలోకి రావలసిన అవసరమే లేదు. ఈరోజు నారా లోకేష్, బాలకృష్ణ మద్య నిలబడి మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా?
5. మీ అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, దౌర్జన్యాలు, ఈ వేధింపులే మేము కలిసి పనిచేసేలా చేశాయని మీకు తెలుసా?
6. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే రాష్ట్ర సరిహద్దు వద్ద వందలాది మంది పోలీసులను మోహరించి అడ్డుకొన్నారు. నేను ఏపీలో రాకూడదని మీరు ఎలా నిర్ణయిస్తారు?నన్నే మీరు అడ్డుకొని కదలనీయకుండా చేస్తున్నప్పుడు ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?వాళ్ళని బ్రతకనిస్తారా? ఎవరూ జిల్లాలలో పర్యటించకూడదు. ఇళ్ళలో నుంచి బయటకు రాకూడదు. ఎవరూ చేతులు ఊపకూడదు అంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందో అర్దమవుతూనే ఉంది.
7. జగన్.. వైసీపి నేతలు అందరూ జాగ్రత్తగా వినండి. మీకు మరో 6 నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఈలోగా మీరు చేస్తున్న తప్పులని సరిచేసుకొంటారో లేక ఆ తర్వాత పర్యవసనాలకు సిద్దామవుతారో మీరే తేల్చుకోండి.
8. మీరు యుద్ధమే కోరుకొంటే యుద్ధమే ఇస్తాము. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకొనే మీతో పోరాడేందుకు రాజకీయాలలోకి వచ్చాను. ఇటీవల నేను కోనసీమలో పర్యటిస్తున్నప్పుడే 2,000 మంది కిరాయి గుండాలను దింపి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించడంతో నేను వెనక్కు తగ్గాను.
9. ఈవిదంగా మాపై దాడులు చేయాలనుకొన్నవారికి, ఇసుక, మట్టి, మైనింగ్ దోపిడీలు చేస్తున్న వైసీపి నేతలనీ అందరి సంగతి తెలుస్తాము. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
10. వైసీపి నేతలకి వత్తాసు పలుకుతున్న అధికారులకి అందరికీ ఇప్పుడే చెపుతున్నా.. ఓ ఆర్దిక నేరాస్తుడు చెప్పిననట్లు ఆడితే రేపు మీ అందరూ కూడా ఆయనతో పాటు జైళ్ళకు వెళ్ళవలసి వస్తుంది. గతంలో ఆయన తన వెంట చాలామంది అధికారులనే జైలుకి తీసుకువెళ్ళాడు. రేపు పదవి కోల్పోయిన తర్వాత కూడా తీసుకువెళతాడు.
11. తన సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి, సొంత బాబాయ్ని హత్య చేయించిన వ్యక్తిని వెనకేసుకు తిరుగుతున్న వ్యక్తి మీ అందరినీ కాపాడుతారంటే నమ్ముతారా?
12. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పట్టువిడుపులు తెలిసిన నాయకుడు. కానీ ఆయన కొడుకు జగన్కు ఆ అలవాటు లేనేలేదు. అందుకే చంద్రబాబు నాయుడుని జైల్లో కూర్చోబెట్టి పైశాచికానందం అనుభవిస్తున్నారు.
13. గుజరాత్ రాష్ట్రంలో మాదకద్రవ్యాలు పట్టుబడితే దాని మూలాలు విజయవాడలో ఓ కంపెనీలో ఉన్నాయని తేలింది. మావంటి ప్రతిపక్ష రాజకీయ నాయకులను వేధించే ఏపీ పోలీసులు వాళ్ళలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?ఎందుకు చేయలేదు?మీడియా కూడా మమ్మల్ని ప్రశ్నిస్తుంటుంది. ఏం మీరు ఈ రాష్ట్రంలో పౌరులు కారా? ఈ రాష్ట్రం పట్ల మీడియాకు బాధ్యత లేదా?మరెందుకు ఈ ఆరాచకాలు, అక్రమాలు, అవినీతి, మాదక ద్రవ్యాల గురించి ప్రశ్నించరు?అంటూ పవన్ కళ్యాణ్ సిఎం జగన్ణు, మంత్రులను, అధికారులను, అందరినీ నిలదీసి ప్రశ్నించి, ఘాటుగా హెచ్చరించారు.



