ఆంధ్రాలో వైసీపీ వెర్సస్ టీడీపీ, జనసేనల మద్య రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వైసీపీ వ్యూహం మార్చుకుని జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ని పల్లెత్తుమాట అనకుండా టీడీపీతో మాత్రమే యుద్ధాలు చేస్తుంటుంది.
ఆవిదంగా ఎందుకు చేస్తోంది?భవిష్యత్లో జనసేనతో అవసరం పడుతుందనా లేదా ఆ పార్టీని విమర్శిస్తుండటం వలన దాని స్థాయి ఇంకా పెంచినట్లవుతుందనే ఆలోచనతోనా?అనే ప్రశ్నలకు ఎవరికి వారు సమాధానాలు చెప్పుకోవలసిందే.
కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి “ఆయన కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ” అంటూ జగన్ చాలా చులకనగా మాట్లాడారు.
కొద్ది సేపటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు, “ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దొడ్డిదారిలో అన్నకి మంత్రి పదవి కట్టబెడుతున్నందుకు అభినందనలు,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
అంటే పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ మళ్ళీ వ్యూహం మార్చుకుందా లేదా మరేదైనా కారణం ఉందా?అనే సందేహం కలుగుతుంది. దీనికి బలమైన కారణమే కనిపిస్తోంది.
జనసేన దాని అధినేత రాజకీయాలకు పనికిరారు.. రాణించలేరని జగన్, వైసీపీ నేతలు అనుకుంటే, వారే ఇప్పుడు శాసనసభలో అడుగుపెట్టలేని దుస్థితిలో ఉన్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ని ఓడించి రాజకీయ సమాధి కట్టాలనుకున్న చోటే అంటే.. పిఠాపురంలోనే ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా, చాలా సంతోషంగా జరుపుకోబోతున్నారు. కనుక వైసీపీ నేతలు ముఖ్యంగా.. జగన్ జీర్ణించుకోవడం చాలా కష్టమే. బహుశః ఆ కడుపు మంటే జగన్, అంబటి రాంబాబు మాటలలో కనిపించిదనుకోవచ్చు.
అయితే పవన్ కళ్యాణ్ గురించి చులకనగా మాట్లాడితే జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తారని వైసీపీ నేతలకు తెలుసు. కానీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో జగన్ మీద విరుచుకుపడటం వారు ఊహించనిదే.
ఎన్నికలకు ముందు టీడీపీతో జనసేన కలవకుండా దూరంగా ఉంచేందుకు పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి జగన్ స్వయంగా ఆ రెండు పార్టీలను కలిపారు. అదేవిదంగా ఇప్పుడూ ఈవిదంగా మాట్లాడి నారా లోకేష్-పవన్ కళ్యాణ్ల మద్య బంధం బలపడేలా చేశారు. వారి మద్య ఎటువంటి విభేధాలు లేవని వారి చేతే నిరూపింపజేశారు. జగన్ గొప్ప వ్యూహాలన్నీ ఇలా బెడిసికొడుతున్నాయేమిటో?




