పక్కలో బల్లెంలా… మంగళగిరిలోనే పవన్‌! ఇప్పుడెలా?

Pawan-Kalyan-Managalagiriనారా లోకేష్‌ ఎందుకు పనికిరాడని వైసీపీ అనుకొంటే ఇప్పుడు ఆయన ధాటిని తట్టుకోలేక వైసీపీ నేతలు విలవిలలాడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎందుకు పనికిరాడని లైట్ తీసుకొంటే, ఆయన కూడా రెండు వారాహి యాత్రలతోనే వైసీపీ పునాదులు కదిలిపోయేలా చేశారు.

ఇంతకాలం పవన్‌ కళ్యాణ్‌‌ హైదరాబాద్‌లో ఉంటూ షూటింగ్‌ మద్యలో వచ్చిపోతూ ‘పార్ట్ టైమ్ రాజకీయాలు’ చేస్తుంటారని ఎద్దేవా చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు ఆయన మళ్ళీ హైదరాబాద్‌ వెళ్ళి సినిమా షూటింగ్‌లు చేసుకోవాలని దేవుడికి దణ్ణాలు పెట్టుకొంటున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఏ ‘దేవుడూ’ వారి మొర ఆలకించిన్నట్లు లేదు. వారి అధినేత జగన్‌ విశాఖకు షిఫ్ట్ కాకపోయినా, వారి ప్రియ శత్రువు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మంగళగిరికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇక ప్రజల మద్యే ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరి పార్టీ ఆఫీసు పక్కనే కొత్తగా నిర్మించిన భవనంలోకి షిఫ్ట్ అయిపోతున్నారు.

ADVERTISEMENT

ఇకపై సినిమా షూటింగులు ఉన్నప్పుడే హైదరాబాద్‌కు వెళ్ళాలని మిగిలిన సమయం అంతా మంగళగిరిలోనే ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకొన్నారు. కనుక ఇకపై సినిమా నిర్మాతలు, దర్శకులు తదితరులు మంగళగిరికే వచ్చిపోతుంటారు.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి తన సినిమాలు, రాజకీయాలకు చెందిన అన్ని ఫైల్స్, కంప్యూటర్స్ వగైరా అన్నిటిని మంగళగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. త్వరలోనే మళ్ళీ మూడో విడత వారాహియాత్ర మొదలుపెట్టేందుకు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు.

జనసేనతో కలిసి పనిచేస్తామని, త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ని కలుస్తానని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. కానీ ఆమె వయసులోను, రాజకీయాలలో తన కంటే చాలా సీనియర్ కనుక త్వరలో పవన్‌ కళ్యాణే ఆమె వద్దకు వెళ్ళి ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలన్నీ వైసీపీకి చాలా కంటగింపుగానే ఉంటాయి. కానీ భరించక తప్పదు. తమ రాజకీయ ప్రత్యర్ధులను అసమర్ధులుగా భావిస్తూ చులకనగా మాట్లాడుతుండే వైసీపీ, ఇప్పుడు ఇంతమంది శత్రువులను ఒంటరిగానే ఎదుర్కోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories