పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నుంచి ఏపీ రాజకీయాలలో బిజీ అయిపోవడం వలన మొదలుపెట్టిన మూడు సినిమాలు ఇంత వరకు విడుదల కాలేకపోయాయి.
ఎన్నికల తర్వాత అయినా సమయం కేటాయించి సినిమాలు పూర్తి చేస్తారనుకుంటే, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవుల పని భారంతో ఇంకా బిజీ అయిపోయారు. కనుక ఆయన సినిమాలు ఎప్పుడు పూర్తిచేస్తారో ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎవరికీ తెలీదు.
కానీ తనని వెండి తెరపై చూసుకోవాలనే అభిమానుల ముచ్చట మాత్రం పవన్ కళ్యాణ్ ఈరోజు తీర్చేశారు.
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, రావివలస పంచాయతీ ప్రజలందరిని టెక్కలిలోని ఓ సినిమా థియేటర్కు తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
థియేటర్లో సినిమా తెరపై తమ అభిమాన హీరోని హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పాత్రలలో అభిమానులు చూడాలనుకుంటే, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వారికి వెండితెరపై కనపడి సంతోషపరిచారు.
ఇదో సరికొత్త ప్రయోగమే కనుక ప్రజలందరూ ఉత్సాహంగా టెక్కలిలో థియేటర్కి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా రిలీజ్ అయినట్లు, థియేటర్కి బయట అభిమానుల సందడి సరే సరి!
గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలనే సదుదేశ్యంతో పవన్ కళ్యాణ్ ‘మాట-మంతి’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల నుండి చక్కటి స్పందన వచ్చింది. కనుక ఇక ముందు పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చూపించే అవకాశం ఉంది.
ఆయన స్పూర్తితో మిగిలిన మంత్రులు కూడా థియేటర్లకు ప్రజలను రప్పించడం మొదలుపెడితే, టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేసుకునేందుకు థియేటర్స్ లభించకపోవచ్చు.




