ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా మహా కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
కానీ పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించి పుణ్యస్నానాలు చేసి, పూజలు చేయడాన్ని తప్పు పడుతూ వైసీపీ బ్యాచ్ విమర్శలు చేస్తుండటంతో పవన్-జగన్ వ్యక్తిత్వాల గురించి, వారి కుటుంబ బంధాల గురించి కూడా చర్చ మొదలైంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఎంత అవహేళనగా మాట్లాడేవారో అందరూ విన్నారు. కానీ జగన్ తనని ఇంతగా అవమానించినా పవన్ కళ్యాణ్ ఏనాడూ నోరు జారలేదు. జగన్పై రాజకీయ విమర్శలు చేస్తుంటారే కానీ వ్యక్తిగత విమర్శలు చేయరు. ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడరు.
పవన్ కళ్యాణ్ నోరు విప్పి ఒక్క విమర్శ చేయకపోయినా తమ ఇద్దరి కుటుంబాలు ఎటువంటివో నిరూపించి చూపుతూనే ఉన్నారు.
గత ఏడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో తిరుమల వెళ్ళినప్పుడు, తన రెండో కుమార్తె పలీనా క్రీస్టియన్ కనుక తండ్రీ కూతుర్లు ఇద్దరూ డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసి అన్యమతస్థుల విషయంలో తిరుమల సాంప్రదాయాన్ని గౌరవించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల సందర్శించినప్పుడు ఏనాడూ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసేవారు కారు. కల్తీ నెయ్యి వివాదం జరుగుతున్నప్పుడు జగన్ తిరుమలకు రావాలనుకున్నారు. కానీ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి వస్తుందని పర్యటన రద్దు చేసుకున్నారు.
జగన్ భార్య భారతి క్రీస్టియన్ కనుక ఏనాడూ భర్త వెంట తిరుమలకు వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే ఆమె పట్ల, ఆ భార్య భర్తల పట్ల ప్రజలలో గౌరవం మరింత పెరిగి ఉండేది.
కానీ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవ మన దేశస్థురాలు కారు. క్రీస్టియన్ కూడా. అయినప్పటికీ భర్తతో కలిసి మహా కుంభమేళకు వెళ్ళి త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసి హిందూ సాంప్రదాయాల ప్రకారం భర్తతో కలిసి పూజలు కూడా చేశారు. వారిని చూసి భక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ విడిపోయినప్పటికీ నేటికీ వారిరువురూ పరస్పరం గౌరవించుకుంటారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవ వారి పిల్లలను పరాయివారిగా భావించకుండా సొంత పిల్లలుగానే భావించి ప్రేమిస్తుంటారు. అఖిరా నందన్ని వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్ళి ముగ్గురూ కలిసి పుణ్యస్నానాలు చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.
పవన్ కళ్యాణ్ రెండుసార్లు విడాకులు తీసుకొని మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉండొచ్చు. కానీ భార్య భర్తల మద్య, పిల్లల మద్య అనుబంధాలు ఏవిదంగా ఉండాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నేవ నిరూపించి చూపుతూనే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ని అంతగా ఈసడించిన జగన్ కుటుంబంలో బంధుత్వాలైనా బలంగా ఉన్నాయా?అంటే ఆయనని భార్య అనుసరించరు!
తమ కోసం, తమ పార్టీ కోసం పనిచేసిన తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలని జగన్ మెడ పట్టుకొని బయటకు గెంటేశారు. చివరికి ఆస్తుల కోసం వారిని కోర్టుకి కూడా ఈడ్చారు.
అక్కడితో ఆగలేదు. విజయమ్మ, షర్మిలపై సొంత పార్టీ నేతలతో, సొంత మీడియా చేత చాలా అనుచితంగా విమర్శలు చేయించారు.
ఈ నేపధ్యంలో జగన్, పవన్ వ్యక్తిత్వాలను, వారి కుటుంబాలను, బంధుత్వాలను పోల్చి చూస్తే, కనీసం ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్కి జగన్ సాటిరారని స్పష్టమవుతోంది.. కదా?




