ఏపీలో బీజేపి.. కర్ణాటకలో కాంగ్రెస్.. కుంకీ బంధం!
కాంగ్రెస్, బీజేపిలు బద్ద శత్రువులు. ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా వాటి రాజకీయాలకు అతీతంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ఆంధ్రాలో చిత్తూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల చుట్టూ పక్కల అడవులలో నుంచి ఊళ్ళలోకి ఏనుగులు మందలు వచ్చేసి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు కర్ణాటక ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
కనుక పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం బెంగళూరు వెళ్ళి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యని వాటి కోసం అభ్యర్ధించగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈరోజు బెంగళూరు విధానసౌధ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య , ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు.
వాటిని ఆంధ్రాకు తీసుకువెళ్ళి ఉపయోగించుకునేందుకు అవసరమైన పత్రాలు పవన్ కళ్యాణ్కి అందజేశారు. అలాగే వాటి సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించే పత్రాలు కూడా అందించారు.
పవన్ కళ్యాణ్ కన్నడలో ప్రసంగం ప్రారంభించిన ‘భరతమాత ముద్దు బిడ్డ కర్ణాటక తల్లికి, పవిత్రమైన ఈ నెలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..’ అన్నప్పుడు సభకు వచ్చిన ప్రజలు, అభిమానులతో పాటు వేదికపై ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కూడా చప్పట్లు కొట్టి తమ సంతోషం వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాలలో బద్ద శత్రువులైన పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటారు. కనుక కుంకీ ఏనుగులు కావాలని ఆయన ఆడగగానే సిద్దరామయ్య కాదనకుండా వెంటనే 5 ఏనుగులను అందించారు.
రాజకీయాలకు అతీతంగా ఇరుగుపొరుగు రాష్ట్రాల మద్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్య ఇటువంటి సత్సంబంధాలు ఉంటే ఏదైనా సాధించవచ్చు. మరింత వేగంగా దేశాభివృద్ధి జరుగుతుంది.




