ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ‘జనసేన’ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఓ ప్రముఖ వ్యక్తి స్టీవ్ జార్డింగ్ ను కలుకున్న విషయం తెలిసిందే. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలోని కెనెడీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న స్టీవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రజా విధానాలు, రాజకీయ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలపై ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రాజకీయ నేతల కాకుండా, ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఆయనను కలిసి తగు సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జార్డింగ్ ను పవన్ కలిసినట్లు సమాచారం. ఏపీలో 2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించారని, రాజకీయ ఎత్తుగడలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో… ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరోమారు కలుస్తానని జార్డింగ్ తో పవన్ అన్నట్లు సమాచారం. కాగా యూపీలో తమ పార్టీ అభివృద్ధి నిమిత్తం ములాయం సింగ్ యాదవ్ కూడా చాలాసార్లు జార్డింగ్ ను కలిశారట. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్డింగ్ వ్యూహాలనే అఖిలేష్ అమలు చేస్తున్నారని సమాచారం.



