ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏవిషయం పైనైనా పూర్తి అవగాహనతోనే మాట్లాడుతారు. అప్పుడూ చాలా ఆచి తూచి మాట్లాడుతుంటారు.
ఆర్ధిక మంత్రిగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, హామీలు, సంక్షేమ పధకాలకు నిధులు సమకూర్చుకోవడం వంటి చాలా బరువైన బాధ్యతలు మీద పడటంతో ఆయన మీడియా ముందు అరుదుగా కనపడుతుంటారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రతీరోజూ సభలో ఏదో అంశంపై మాట్లాడుతూ కనిపిస్తున్నారు.
ఈరోజు మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు ఆయనని రాయలసీమ ప్రాజెక్టుల గురించి నిలదీశారు.
వైసీపీ సభ్యుల దురదృష్టం ఏమిటంటే, సాగునీటి ప్రాజెక్టుల గురించి లోతైన అవగాహన, వాటిని పూర్తి చేయాలనే నిబద్దత కలిగి, రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు సభలో ఉండటం.
అలాగే ఈ ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాల గురించి లోతైన అవగాహన కలిగిన మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సభలో ఉండటం.
కానీ వారిరువురూ సభలోనే ఉన్నారనే విషయం మరిచి, తమ అధినేత సూచన మేరకు రాయలసీమ ప్రాజెక్టుల ప్రస్తావన చేశారు. కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళన చేశారు.
అప్పుడు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన సమాధానం విని ఏవిధంగా స్పందించాలో తెలియక వైసీపీ సభ్యులు పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. దానికీ పయ్యావుల సమాధానం మామూలుగా లేదు.
“మీ నాయకుడు సభకి రాకుండా రాయలసీమ ప్రాజెక్టుల గురించి సభలో మమ్మల్ని నిలదీయమని పంపించారని మాకు తెలుసు. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులని పట్టించుకోకుండా, ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే మా నుంచి ఏం సమాధానం వస్తుందో మీకు తెలిసే ఉండాలి.
మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎలా ఉందో, మీకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత, హక్కు మాకున్నాయి. కనుక మేము సమాధానం చెపుతుంటే వినే ఓపిక మీకు ఉండాలి.
కానీ మీరడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెపుతుంటే సభలో అరుపులు, కేకలు దేనికి? మీకు నచ్చిన సమాధానం చెప్తామని ఎలా అనుకున్నారు? మా సమాధానం మీకు నచ్చకపోతే తప్పు మాదవుతుందా?” అని మంత్రి పయ్యావుల వైసీపీ సభ్యులను నిలదీశారు.




