ఈరోజు శాసనసభలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వైసీపీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే, “పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. పొగ తాగితే క్యాన్సర్ బారిన పడి చనిపోతారని పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు పొగ త్రాగటం మానేయడం లేదు.
క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాతే మానేస్తుంటారు. కానీ అప్పటికే సమయం మించిపోతుంది కనుక వారి ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. అందుకే ప్రజలు క్యాన్సర్ వ్యాధి భారిన పడి ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ప్రభుత్వాలు పదేపదే పొగ త్రాగుట హానికరం.. పొగ తాగితే క్యాన్సర్ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తూనే ఉంటాయి. అది వాటి బాధ్యత.
అదేవిదంగా వైసీపీ దాని అధినేత జగన్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం అని మేము ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నాము. జగన్ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఏవిదంగా భ్రష్టు పట్టించేస్తారో అందరం చూశాము. కనుక భవిష్యత్లో జగన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే మేము శాసనసభ లోపల, బయట కూడా పదేపదే వైసీపీని, జగన్ని దూరంగా పెట్టండి.. రాష్ట్రాన్ని, మిమ్మల్ని మీరు కాపాడుకోండని హెచ్చరిస్తూనే ఉన్నాము.
అయితే ఇది ప్రజలకు అర్దమయ్యేందుకు జగన్ 5 ఏళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని విధాలుగా నష్టపరిచారో అవకాశం చిక్కినప్పుడల్లా వివరిస్తూనే ఉంటాము,” అని అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరనే జగన్ వాదనలను మంత్రి పయ్యావుల తిప్పి కొట్టారు. “మీరు మాట్లాడేందుకు సమయం ఇవ్వరని మీకు మీరుగా అనేసుకొని మమ్మల్ని నిందిస్తే ఎలా? శాసనసభ సమావేశాలకు వస్తే కదా మాట్లాడేందుకు సమయం లభిస్తోందో లేదో తెలుస్తుంది.
మీరు శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడుతామంటే, నేను మా మంత్రులు మా సమయాన్ని తగ్గించుకొని మీకు అవకాశం ఇస్తాము. కనుక శాసనసభకు రావాలని జగన్కు విజ్ఞప్తి చేస్తున్నాను.
కానీ చేసిన పాపాలకు భయపడి శాసనసభకు రాకుండా మమ్మల్ని నిందిస్తున్నారని అందరికీ తెలుసు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఇక్కడ జరిగిన చర్చాలపై ప్యాలస్లో కూర్చొని కామెంట్స్ చేస్తాను.. ప్రశ్నిస్తాను.. అంటే మేము సమాధానం చెప్పాలా?” అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
జగన్ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాంటి వ్యక్తి మళ్ళీ నేనే ముఖ్యమంత్రినవుతానని, 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని చెపుతున్నారు. జగన్ చెప్తున్న ఈ మాటలు వింటున్న పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. కనుక వారికి ఆ భయం ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంత్రి పయ్యావుల చెప్పిన్నట్లుగా ప్రజలు కూడా వైసీపిని దూరంగా పెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది.




