ప్రజల మద్యకు రావడానికి కూడా హింస అవసరమా?

mithun-reddy-tdp-ysrcp-fight

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి అప్పుడే నెల రోజులు దాటింది. కానీ ఇంకా టిడిపి-వైసీపిల మద్య ఇంకా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

ఇదివరకు జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టిడిపి శ్రేణులు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు కూడా టిడిపి నేతలు, కార్యకర్తలు టిడిపి కార్యాలయాలపై వైసీపి దాడులు, హత్యలు, పోలీస్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ భయంతో పల్నాడులో కొన్ని గ్రామాలలో టిడిపి మద్దతుదారులు వలసలు వెళ్ళిపోయారు కూడా.

చంద్రబాబు నాయుడు అరెస్టుతో టిడిపి పని అయిపోయిందనే అనుకున్నారు. కనుక గత 5 ఏళ్ళలో వైసీపి దాడులను కాసుకోవడానికే టిడిపికి సరిపోయింది తప్ప ఎన్నికలలో ఓడిపోయినా ఇప్పుడు వైసీపిలా రోడ్లపైకి వచ్చి ఎదురుదాడులు చేసే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా చంద్రబాబు నాయుడు అటువంటి చర్యలకు పాల్పడేందుకు పార్టీ నేతలను, కార్యకర్తలను అనుమతించేవారు కారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, అచ్చనాయుడు, అయ్యన్నపాత్రుడు, పట్టాభితో సహా టిడిపిలో అందరూ వైసీపి బాధితులే. కానీ వారు వైసీపి దాడులను ఎదురుదాడులతో కాక బలమైన నాయకత్వం, అలుపెరుగని రాజకీయ పోరాటాలతో ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కొన్నారు.

బాదుడే బాదుడు, నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పర్యటనలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

అంటే ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షంలోకి మారినప్పుడు ఏవిదంగా ముందుకు సాగాలో చంద్రబాబు నాయుడు చేసి చూపారన్న మాట!

అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఏవిదంగా వ్యవహరించకూడదో జగన్మోహన్‌ రెడ్డి చేసి చూపారు. కనుకనే ఎన్నికలలో ఓడిపోయారు. అయినా వైసీపి తీరు మారలేదు.

ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించగానే పోలింగ్‌ సమయంలోనే విధ్వంసానికి పాల్పడిన వైసీపి, ఆ తర్వాత కూడా అలాగే వ్యవహరించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల తర్వాత కూడా ఇంకా వైసీపి దౌర్జన్యాలకు తెగబడుతుండటం తెంపరితనమే.

ప్రజలకు మొహాలు చూపలేకపోతున్న జగన్, వైసీపి నేతలు ఏదో ఓ బలమైన సాకుతో ప్రజల మద్యకు రావాలని ఎదురుచూస్తున్నారు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఇంకా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేలా చూస్తున్నారనిపిస్తోంది.

ఇందుకు తాజా నిదర్శనంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పుంగనూరులో మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి వెళ్ళడమే. దీంతో ఒక్కసారిగా పుంగనూరులో మళ్ళీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ ఘటనతో రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. 1. టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని. 2. వారి ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చాలని వైసీపి ప్రయత్నిస్తోందని.

వైసీపి తీరు ఎన్నటికీ మారదు కనుక టిడిపి శ్రేణులే సంయమనం పాటించాలి. అప్పటికీ వైసీపి శ్రేణులు రెచ్చిపోతే సిఎం చంద్రబాబు నాయుడు, హోమ్ మంత్రి అనిత వంగలపూడి వారి సంగతి చూసుకుంటారు కదా!

ADVERTISEMENT
Latest Stories