ఏపీలో రాజకీయ నాయకుల పాదయాత్రల గురించి చెప్పుకోవాలంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు, తాజాగా నారా లోకేష్ పాదయాత్రల గురించి చెప్పుకోవలసి ఉంటుంది.
అయితే పాదయాత్ర కంటే ముందు ఓదార్పు యాత్రలు చేసి ఆ పగిలిన గుండెలతో వైసీపీకి బలమైన పునాది వేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమైఖ్య శంఖారావం పూరించినా ఏపీ ప్రజలు ఆయనను నమ్మలేదు. కారణాలు అందరికీ తెలుసు.
కనుక జగన్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఆయన మాట్లాడిన మాటలు నేటికీ సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇచ్చిన హామీలు లేదా చేసిన వాగ్ధానాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటితో పాటు ఆయన ప్రజలకు అందించిన ఆశీర్వాదాలు, కురిపించిన ముద్దుల వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంటాయి.
ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు ఆ అలవాటు ఇంకా పోలేదని గిట్టనివాళ్ళు గుసగుసలు ఆడుకొంటారు. ఇపుడు ఆయన ప్రసంగాలలో మరింత పరిపక్వత కూడా కనిపిస్తోందంటారు. ‘నలుగురు పెళ్ళాలు’, ‘ముద్దులు పెట్టడం’, ‘కడుపులు చేయడం’ వంటి అనేక పదాలు అలవోకగా పలికేస్తున్నారు. అది వేరే సబ్జెక్ట్!
మళ్ళీ పాదయాత్రల విషయానికి వస్తే టిడిపి యువనేత నారా లోకేష్ కూడా యువగళం పేరుతో గత 165 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2178 కిమీ పాదయాత్ర చేశారు. ఇంకా మరో 235 రోజులపాటు శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఇవాళ్ళ ప్రకాశం జిల్లాలోని సంతనూలపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
జగన్ పాదయాత్రతో పోలిస్తే నారా లోకేష్ పాదయాత్ర చాలా భిన్నంగా సాగుతుండటం అందరూ గమనించే ఉంటారు. ఆయన పాదయాత్రలో మహిళలు, పిల్లలు, యువతీ యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మైనార్టీలు, బ్రాహ్మణులు… ఇలా అన్ని వర్గాల ప్రజలతోను మనసువిప్పి మాట్లాడుతూనే ఉన్నారు.
వారి సమస్యలను సావధానంగా వింటూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని ఏవిదంగా పరిష్కరిస్తుందో వివరించి హామీలు ఇస్తున్నారు. అవసరమైన అంశాలను పార్టీ మానిఫెస్టోలో పెట్టించేస్తున్నారు కూడా.
అయితే ఈ 165 రోజులలో అన్ని వర్గాలకు, వయసులకు చెందిన ఇన్ని లక్షలమంది ప్రజలను కలిసినా నారా లోకేష్ ఏనాడూ ఎవరి నెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదాలు ఈయలేదు. ఎవరి బుగ్గలు నిమరలేదు. ఎవరికీ ముద్దులు పెట్టలేదు.
అందరితో ప్రేమగా, అభిమానంగా , వినయంగా మాట్లాడుతూనే చాలా హుందాగావ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ఏ అంశం, సమస్యపైనైనా సాధికారికంగా మాట్లాడుతూ అందరినీ మెప్పిస్తున్నారు.
మాతృదినోత్సవంనాడు ఆయన ఏమాత్రం బేషజానికి పోకుండా నేలపై తల ఆనించి తమకు నమస్కరించడాన్ని మహిళలు ఎవరూ మరిచిపోలేరు. మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారే ఆప్యాయంగా అన్నా… తమ్ముడు… మానవడా… అంటూ నారా లోకేష్ చేతులు పట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతున్నారు తప్ప నారా లోకేష్ ఏనాడూ వారితో అతిగా ప్రవర్తించలేదు. నారా లోకేష్లో ఈ హుందాతనం చూస్తున్నప్పుడు జగన్ పాదయాత్ర కళ్ళ ముందు కదలాడితే ఆశ్చర్యం లేదు.



