వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు అన్ని బాధ్యతలు ప్రభుత్వ సలహాదారు హోదాలో తన భుజాన మోశారు సజ్జల రామకృష్ణ రెడ్డి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానాల నిర్ణయం మొదలు విశాఖే రాజధాని అనే ఋషి కొండ నిర్మాణాల వరకు వైసీపీ విధానాలను ప్రజలకు వివరించారు సజ్జల.
అయితే నాడు ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ షెడ్యూల్ నుంచి మంత్రులుగా వైసీపీ నేతల ప్రెస్ వరకు అన్ని సజ్జల కనుసన్నలలోనే నడిచేవి అనే టాక్ వైసీపీ ఓటమి తరువాత గట్టిగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడా బాధ్యతలను మాజీ మంత్రి పేర్ని నాన్ని అందిపుచ్చుకున్నారా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి.
వైసీపీ కి సంబంధించిన ఏ అంశం మీదైనా మాట్లాడాలి అన్నా, జగన్ పై ప్రత్యర్థి పార్టీ నేతలు చేసి విమర్శలకు కౌంటర్ వేయాలన్నా, ప్రభుత్వం పై, ప్రభుత్వ పెద్దల పై విరుచుకుపడాలన్నా, జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతు తెలపాలన్నా ముందుగా మీడియాలో కనిపిస్తున్న వ్యక్తి, వినిపిస్తున్న గొంతు పేర్ని నాని.
తాజాగా మీడియా ముందుకొచ్చిన పేర్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాల నుంచి ఉపముఖ్యమంత్రి పవన్ చికిత్స వరకు ప్రతి అంశం మీద విమర్శల మోత మోగించారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతుందని, అందుకు ఒకరితో ఆపకుండా ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని, మూడో బిడ్డకు జన్మనిస్తే 30 వేలు, నాల్గవ బిడ్డకు జన్మనిస్తే 40 వేలు ప్రభుత్వ నుంచి ఆర్థిక సాయం చేస్తామంటూ బాబు ఇచ్చిన పిలుపు పై పేర్ని కామెంట్స్ చేసారు.
ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనాలో బాబు చెప్పాలని, మూడు, నాల్గవ బిడ్డ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందా.? అని ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రభుత్వం ఇచ్చే 30 వేలు 40 వేలు ఆర్థిక సాయం తో బిడ్డ భవిష్యత్ గడుస్తుందా.? ,ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఇక ఉపముఖ్యమంత్రి తనకు అనారోగ్యం వస్తే చికిత్స కోసం హైద్రాబాద్ వెళ్లారని, ఆయనకు అవసరమైన శస్త్ర చికిత్స హైద్రాబాద్ లోనే చేయించుకున్నారని, మరి ఏపీలో పిల్లల పరిస్థితి ఏంటంటూ వాదిస్తున్నారు పేర్ని. అయితే గతంలో జగన్ ప్రభుత్వంలో కరోనా సమయంలో వైసీపీ నేతలు కూడా ఏపీ ఆసుపత్రులను వదిలి హైద్రాబాద్ వెళ్లి మరి చికిత్స తీసుకున్నారు.
అంటే జగన్ హయాంలో ఏపీలో ఆసుపత్రులలో మెరుగైన సదుపాయాలు కల్పించలేకపోయారా.? ఇక జగన్ ఇప్పటికి వారంలో కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే ఏపీలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. మిగిలిన రోజులన్నీ అయితే బెంగళూర్ ప్యాలస్ లేదంటే లోటస్ పాండ్ వేదికగా సాగడం లేదా.?
అలాగే నాడు జగన్ ని పరదాల ముఖ్యమంత్రి అంటూ అందరు వేలెత్తి చూపించారు, మరి ఇపుడు బాబు, పవన్, లోకేష్ కనీసం ఆ పరదాల చాటున కూడా ప్రజల మధ్యకు రాలేకపోతున్నారని అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. పొద్దున్న లేస్తే సీఎం బాబు నిత్యం ప్రజల మధ్యే కనిపిస్తారు. ఇక మంత్రి లోకేష్ సైతం తన శాఖలను పర్యవేక్షిస్తూ అటు విద్యార్థులతో సమయాన్ని గడుపుతారు, ఇటు తన నియోజకవర్గ ప్రజలకు సమయాన్ని ఇస్తున్నారు.
తాజాగా ఉపముఖ్యమంతి పవన్ సైతం తన శస్త్ర చికిత్స కోసం తీసుకున్న విశ్రాంతికి ముగింపు పలికి పార్టీ కార్యక్రమాలతో, ప్రభుత్వ సమీక్షలతో బిజీ అయ్యారు. నేడు రాజమండ్రి పర్యటనలో ఉన్న పవన్ రెండేళ్లలో రానున్న గోదావరి పుష్కరాల మీద అధికారులతో సమీక్షలు జరిపారు.
నీటి కాలుష్య నివారణకు, నదుల పరిరక్షణకు అవసరమైన చర్యలు, వాటి అమలు తో వచ్చే మార్పులు ఆరు నెలలలో పేపర్ మీద కాదు గ్రౌండ్ లో కనిపించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే కాలుష్య నివారణకు100 కోట్ల నిధులను మంజూరు చేసారు.
ఇలా ఈ ముగ్గురు నేతలు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమీక్షలు జరుపుతూ, సూచనలు చేస్తుంటే పేర్ని నాని కళ్లుండి చూడలేని వాడిగా, చెవులుండి వినలేని వాడిగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి.




