ఆనాడు కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తోంది. మొదట కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తోందని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా నేడు సంచలన ఆరోపణలు చేశారు.
నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టిడిపి మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా.
కనుక నాడు తెలంగాణలో జరిగింది నేడు ఏపీలో జరుగుతోంది. నేడు తెలంగాణలో జరుగుతున్నట్లే రేపు ఏపీలో ప్రభుత్వం మారగానే ఫోన్ ట్యాపింగ్ కేసులలో బాధ్యులు జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.
గమ్మత్తైన విషయం ఏమిటంటే, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే కేటీఆర్ గట్టిగా ఖండిస్తున్నారు. కానీ ఏపీలో ప్రతిపక్ష నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఈసీకి పిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు కానీ వైసీపి తరపున వాదనలు వినిపించే సజ్జల రామకృష్ణా రెడ్డి గానీ మీడియా ముందుకు వచ్చి ఖండించడం లేదు! అంటే ఏమనుకోవాలి?
ఇక ఏపీలో వైసీపి కోసం జగన్ సృష్టించిన సాలెగూడు వంటి వాలంటీర్ వ్యవస్థలో వారు ఉండలేక బయటపడలేక అవస్థలు పడుతుంటే, అధికార ప్రతిపక్షాల రాజకీయ చదరంగంలో పావులుగా నలిగిపోతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ కమిటీల పేరుతో 80 వేలమంది కాంగ్రెస్ కార్యకర్తలతో వాలంటీర్ వ్యవస్థ సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే నేడు ఏపీలో జరుగుతున్నది రేపు తెలంగాణలో జరుగబోతోందన్న మాట!
తాజా సమాచారం: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని ఈ నెల 14వరకు సీబీఐ కస్టడీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది.






