కోనసీమ జిల్లా, రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాల్ కృష్ణతో టికెట్ కోసం జరిగిన గొడవలో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేంతవరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో సిఎం జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకొని పిల్లి సుభాష్ చంద్రబోస్ని స్వయంగా బుజ్జగించడంతో ఆయన వెనక్కు తగ్గారు.
అనంతరం బోస్ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఏదో ఆవేశంలో పార్టీని వీడుతానని, స్వతంత్రంగా పోటీ చేస్తానని ఓ పెద్ద మాట అన్నాను. అందుకు జగన్కు క్షమాపణ చెపుతున్నా. పార్టీలోవారే సొంత కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేదిస్తుండటంతో వారు తీవ్ర నిరాశానిస్పృహలలో ఉన్నారు. వారికి ధైర్యం చెప్పేందుకే నేను ఆవిదంగా మాట్లాడవలసి వచ్చింది తప్ప నిజంగా పార్టీని వీడాలని కాదు.
నేను టిడిపి లేదా జనసేనలో చేరబోతున్నట్లు అప్పుడే మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అవేవీ నిజం కావు. వైసీపీని ఈ చేతులతో నేను నిర్మించాను. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈనాడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ నాకు ఎటువంటి లోపమూ చేయలేదు. నన్ను గౌరవంగా చూసుకొంటున్నారు. కనుక వైసీపీని వీడాల్సిన అవసరం నాకు లేదు. టికెట్ విషయంలో జగన్ తన సొంత టీమ్తో సర్వే చేయించి నిర్ణయం తీసుకొంటానని నాకు హామీ ఇచ్చారు. ఆయన మాటను నేను నమ్ముతున్నాను,” అని చెప్పారు.
రామచంద్రాపురం టికెట్ కోసమే ఈ కీచులాటలని బోస్ స్వయంగానే చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు కార్యకర్తల మనోధైర్యం కోసమే హడావుడి చేశానంటున్నారు. ఆయన ఏ కారణంతో హడావిడి చేసినప్పటికీ, టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వలేదని, కేవలం సర్వే చేయిస్తానని మాత్రమే చెప్పారని కూడా ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు.
అంటే నేటికీ జగన్ మంత్రి వేణుగోపాల్ కృష్ణ వైపే మొగ్గుచూపుతున్నారని అర్దమవుతూనే ఉంది. లేకుంటే బోస్కు రామచంద్రపురం టికెట్ ఖరారు చేసి, మంత్రిని వేరే నియోజకవర్గానికి పంపిస్తానని చెప్పి ఉండేవారు. ఈ గొడవతో పార్టీకి నష్టం కలుగుతోంది కనుక జగన్ మరికాస్త సమయం పొందేందుకే జగన్ సర్వే అని చెప్పి బోస్కు సర్ధిచెప్పిన్నట్లు అర్దమవుతోంది.
అంటే రామచంద్రాపురం టికెట్ ఇంకా తెగలేదన్న మాట!కనుక మళ్ళీ త్వరలోనే ఏదో రోజున ఈ పంచాయితీ మొదలవక తప్పదు. అప్పుడు గోడ మీద కూర్చొన్న పిల్లి ఎటో అటు దూకక తప్పదు. ఒకవేళ పిల్లికి రొట్టె ముక్క లభిస్తే మరొకరికి కోపం వస్తుంది. కనుక ఎవరో ఒకరు గోడ దూకడం ఖాయమే.



