
ప్రధాని మోడీ ఈరోజు మద్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, హోం మంత్రి వంగలపూడి అనిత తదితరులు ఘనస్వాగతం పలికారు.
ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాఫ్టర్లో వెలగపూడిలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం సభా కార్యక్రమాలు మొదలయ్యాయి.
Also Read – వైస్ జగన్ పాదయాత్ర…జగన్ 2.0 చూపిస్తారా.?
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని నమో క్షిపణిగా అభివర్ణిస్తూ ఈ క్షిపణి దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరుగుతుందన్నారు. అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు వచ్చినందుకు ప్రధాని మోడీకి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రధాని మోడీ లక్షల మంది ప్రజల సమక్షంలో అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నారు.
ఒక రాష్ట్రానికి ప్రధాన మంత్రి వచ్చి లక్షల కోట్లు విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం చాలా ముఖ్యమైన వార్త. జాతీయ మీడియాలో ఈ వార్తని కవర్ చేస్తున్నాయి. కానీ వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రధాని మోడీ పర్యటనకు సంబందించిన వార్తలే లేవు.
Also Read – బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపినప్పటికీ మొహం చెల్లక చాటేశారు. వైసీపీ నేతలు ఎవరూ కూడా అమరావతిలో అట్టహాసంగా జరుగుతున్న ఈ సభ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి మాట్లాడటం లేదు!
వారందరూ ఇంకా సింహాచలంలో గోడ కూలిన ప్రమాదం గురించే మాట్లాడుతూ, తమకు చాలా ఇబ్బందికరంగా మారిన ప్రధాని మోడీ పర్యటన, ఈ సభ, దానిలో జరుగుతున్న ఈ కార్యక్రమాల ప్రస్తావన చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read – ఓ అందగాడు ఇక్కడ.. మరొకడు ఎక్కడా?
ఎందుకంటే, జగన్ అమరావతిని పాడుబెడితే, వైసీపీ నేతలు అందరూ దానిని కించపరిచేలా మాట్లాడారు. ఒకరు అమరావతిని కమ్మరావతి అని ఎద్దేవా చేయగా మరొకరు భ్రమరావతి అని అవహేళన చేశారు. రాష్ట్ర రాజకీయాలలో అందరి కంటే సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అనేశారు.
కనుక జగన్ ఏ మొహం పెట్టుకొని సభకు రాగలరు? వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో జరుగుతున్న ఈ సభ, కార్యక్రమాల గురించి మాట్లాడగలరు?కనీసం తమ ఇళ్ళలో టీవీల ముందు కూర్చొని ఈ సభని చూసే ధైర్యం వారికి ఉంటుందా?