ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ మే 2న అమరావతికి వస్తున్నారు. ఆరోజు మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ లాంఛనంగా పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రధాని సభ కోసం మంత్రి నారాయణ తదితరులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని షెడ్యూల్, ఏర్పాట్ల గురించి తర్వాత చెప్పుకోవచ్చు. కానీ ప్రధాని మోడీ అమరావతికి వచ్చి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తుండటంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించక పోవడం గమనార్హం.
కారణం అందరికీ తెలిసిందే.. జగన్ ఏది వద్దనికోరుకున్నారో సరిగ్గా అదే జరుగుతోంది. తాను అధికారం కోల్పోయినా ఎట్టి పరిస్థితులలో అమరావతి రాజధాని కాకూడదని జగన్ అనుకున్నారు. అందుకోసం ఓ ముఖ్యమంత్రిగా చేయకూడని పనులన్నీ చేశారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 10 నెలలలోనే మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు నిధులు సమకూర్చుకోవడం మొదలు టెండర్లు ఖరారు చేయడం వరకు అన్ని పనులు పూర్తి చేశారు.
నాడు అమరావతికి భూమి పూజ చేసిన ప్రధాని మోడీ చేతే ఇప్పుడు పునర్నిర్మాణ పనులు ప్రారంభింపజేస్తున్నారు. నాడు జగన్ అమరావతిని ధ్వంసం చేస్తున్నా ఏ కారణాల వల్లనో ప్రధాని మోడీ వారించలేదు.
కానీ ఇప్పుడు అమరావతిని పునర్నిర్మాణానికి సిఎం చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాను వద్దనుకున్న అమరావతి నిర్మాణానికి, తాను ఎంతగానో ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ సహకరిస్తుండటం జగన్ జీర్ణించుకోవడం కష్టమే.
అలాగని ప్రధాని మోడీని విమర్శించే సాహసం చేయలేరు. పైగా అమరావతికి ఇంత నష్టం కలిగించినందున జగన్, వైసీపీ నేతలకు దాని గురించి మాట్లాడే నైతిక అర్హత కోల్పోయారు. అయినప్పటికీ అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రజలు తమనే అసహ్యించుకుంటారని జగన్కి, వైసీపీ నేతలకు తెలిసే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోయే ఓ గొప్ప అవకాశాన్ని జగన్ చేజేతులా వదులుకున్నాక ఇప్పుడు ఎవరినో నిందించి ఏం ప్రయోజనం?
జగన్ అండ్ కో కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉన్నందునే ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై అందరూ గప్చుప్!




