మోడీజీ! … నిరాశ పరాచకండి!

Pm Modi

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొందో అంతకు మించి 5 ఏళ్ళ జగన్‌ పాలనలో విధ్వంసానికి గురైంది.

రాష్ట్ర విభజనతో జరిగిన నష్టాన్ని, ఎదురైన సమస్యలను పట్టుదలగా శ్రమిస్తే అధిగమించవచ్చని చంద్రబాబు నాయుడు నిరూపించి చూపారు. కానీ ఓ రాష్ట్రాన్ని ఇంత పద్దతిగా ఇంత తక్కువ కాలంలోనే శిధిలావస్థకు చేర్చవచ్చని జగన్మోహన్‌ రెడ్డి నిరూపించి చూపారు.

ADVERTISEMENT

జగన్‌ పాలనలో అన్ని రంగాలలో జరిగిన విధ్వంస శిధిలాలలో నుంచి రాష్ట్రం బయట పడటానికి ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలీదు. కానీ ఆ మిగిలిన శిధిలాల మీద కూర్చొని పాలించేందుకు జగన్‌ చొక్కా మడత పెట్టి సిద్దం అంటున్నారు.

ఆ శిధిలాలతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుందామని చెప్పేందుకు నేడు టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి.

రాష్ట్రంలో ‘ఎన్నికల కోడ్’ అమలులోకి రావడం, ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోతుండటంతో జగన్‌ ప్రభుత్వానికి చేతులు కట్టేసిన్నట్లయింది. లేకుంటే టిడిపి, జనసేనలు ఈ సభ నిర్వహించకుండా ఓ ఆట ఆడుకునేదే!

దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అమాయకంగా చంద్రబాబు నాయుడు బుట్టలో పడి మోసపోయారని ఇప్పటికే వైసీపి, దాని ఆత్మసాక్షి కనిపెట్టి నిర్ధారించి చెప్పేశాయి. కనుక ప్రధాని నరేంద్రమోడీపై కూడా ‘వినయంగా విమర్శలు’ గుప్పించడం మొదలుపెట్టాయి.

అయినా సొంత చెల్లి వైఎస్ షర్మిల, మరో చెల్లి సునీతారెడ్డి పైనే కాలాకేయ సైన్యంతో సోషల్ మీడియాలో దాడులు చేయిస్తున్నప్పుడు, టిడిపి, జనసేన, బీజేపీలు ఓ లెక్కా? అంటే కాదనే చెప్పాలి.

ఎన్నికల కోడ్ కారణంగా జగన్‌ ప్రభుత్వానికి బంధాలు పడటంతో, రాష్ట్రం నలుమూలల నుంచి మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు లక్షలాది మంది తరలిరావస్తున్నారు. ఈ సభకు కనీసం 10 లక్షల మందితో విజయవంతం చేయాలని మూడు పార్టీల నేతలు గత వారం పది రోజులుగా ఎంతో శ్రమిస్తున్నారు.

ఇదివరకు వైసీపి నేతల ఒత్తిళ్ళ కారణంగా ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇచ్చేందుకు టిడిపి, జనసేనలకు నో చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులే ఇప్పుడు పిలిచి మరీ ఇస్తున్నారు. అంతా కోడ్ మహిమే అనుకోవాలి. కారణం ఏదైతేనేమి, మూడు పార్టీలు తొలిసారిగా కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రజాగళం సభకు అన్ని అవరోధాలు తొలగిపోవడాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ శుభసూచకమని భావించవచ్చు.

సభ ప్రాంగణంలో ‘గ్రాఫిక్ కార్పెట్స్’ లేవు. ఆ అవసరం లేదు కూడా. సభకు తరలివస్తున్న వారి కోలాహలంతో చుట్టు పక్కల ప్రాంతాలలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా బస్సులే ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా జనాలే!

ఈ సభలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఏమి చెప్పబోతారో ఊహించుకోవచ్చు. కానీ మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత టిడిపి, జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేయబోతోంది కనుక ప్రధాని నరేంద్ర మోడీ జగన్‌ పాలన, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి, కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ ఏపీని పునర్నిర్మించుకోవడానికి ఏవిదంగా సహకరిస్తారనే విషయాలపై స్పష్టత ఇస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు.

అలాకాక రోటీన్ రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోతే మూడు పార్టీలు కలిసి ఎంతో శ్రమించి నిర్వహిస్తున్న ఈ ప్రజా గళం సభకు అర్దం లేకుండాపోతుంది. కనుక ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఈ సభతో ఓ బలమైన నమ్మకం, భరోసా ఇవ్వడం చాలా అవసరం. ఇస్తారనే ఆశిద్దాం. మరికొద్ది సేపటిలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ సభావేదిక వద్దకు చేరుకోబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories