ప్రభుత్వాలను ఇలా కూడా నడపొచ్చా?

Pawan-Kalyan-TDPఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎం నడుస్తుంది అంటే ఇప్పుడు నోటీసులు, కేసులు, అరెస్టులు, దాడులు మాత్రమే నడుస్తున్నాయి అని బలంగా చెప్పవచ్చు.ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తే నోటీసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే దాడులు ఇలా అడ్డగోలుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను నడపొచ్చా? అనే సందేహం వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తున్న సామాన్యుడికి సైతం కలగకమానదు.

ADVERTISEMENT

జనసేన పెడన వారాహి యాత్రలో దాడులకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అంటూ ప్రభుత్వం పై పవన్ చేసిన ఆరోపణలకు కృష్ణ జిల్లా పోలీస్ ఎస్పీ.జాషువా పవన్ కు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చ నియాంశం అయ్యింది. ప్రభుత్వం పై చేసిన ఆరోపణకు ఆధారాలు చూపాలంటూ ఆనోటిసులో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం పై నిరాధారమైన ఆరోపణలు చేశారని పవన్ కు నోటీసులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఒక్క సారి గతాన్ని గుర్తుచేసుకుంటే బాగుంటుందని జనసైనికులు ఆపనిలో పడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని అడ్డంపెడ్డుకుని బాబు లక్షల కోట్లు దోచుకున్నారు అంటూ పుస్తకాలు ప్రచురించిన జగన్ వాటికి ఆధారాలు ఇంతవరకు చూపలేకపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వొచ్చని, కేసులు పెట్టొచ్చని, జైళ్లకు పంపొచ్చని తెలియకపోవడం టీడీపీ తప్పే అవుతుందనుకుంటా.

జగన్ పై జరిగిన కోడికత్తి కేసులో కూడా టీడీపీ హస్తం ఉంది అంటూ గగ్గోగులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న ఆధారాలు చూపలేకపోయారు. బాబాయ్ వివేకా మరణం సినిమా తరహా ట్విస్టులతో సొంత మీడియాలోనే కథనాలు ప్రచురించారు. గుండెపోటు అన్నారు,లేదు లేదు అది గొడ్డలి పోటు అన్నారు, దానికి కారణం టీడీపీ నే అంటూ అప్పటి ప్రభుత్వం పై ఆధారాలు లేని నిందలు మోపారు. చివరికి సాక్ష్యాలు అన్ని వైస్ కుటుంబం వైపే వేలెత్తి చూపే పరిస్థితి.

ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేస్తేనే నోటీసులు ఇచ్చే జగన్ ప్రభుత్వం మరి గతంలో సాక్ష్యాలను తుడిచేసి, అప్పటి ప్రభుత్వం పై వేసిన హత్యాయత్నం నిందలకు జగన్ ను ఏంచేయాలి? పవన్ ప్యాకేజి తీసుకున్నాడు – బాబు ప్యాకేజీ ఇచ్చాడు అంటూ గడిచిన దశాబ్ద కాలంగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు మాదిరి వైసీపీ నాయకులు, వైసీపీ పెద్దలు ఆరోపణలు చేస్తూనే వచ్చారు. వాటికి కూడా జగన్ ఆధారాలు చూపాలి కదా? లేకపోతే జగన్ కు కూడా నోటీసులు ఇచ్చే సాహసం ఏపీ పోలీస్ వ్యవస్థ చేస్తుందేమో చూడాలి మరి!

చంద్రబాబు పై దాడి చేస్తే నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో భాగం అంటారు,ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ లు వచ్చాయి కానీ మందులు మీరేసుకోండి అంటారు. ప్రతిపక్ష నాయకుల మీద కిరాయి గుండాలను పంపి రోడ్ల మీద అరాచకాలు సృష్టిస్తే వారి పై ఎఫైర్ నమోదుచేసే సాహసం కూడా పోలీస్ వ్యవస్థ చేయలేకపోతోంది. విపక్ష పార్టీ సభ్యులను బూతులు తిట్టినా, వారి ఇంట్లో ఆడవారిని అవమానించిన ఇవేమి వ్యవస్థలకు వినపడడం లేదా?కనపడడం లేదా? వ్యవస్థలను వాడుకుంటూ ప్రభుత్వాలను ఇలా కూడా నడపొచ్చని భవిష్యత్ తరానికి మార్గం వేసిన జగన్ ప్రభుత్వానికి శతకోటి వందనాలు.

ADVERTISEMENT
Latest Stories