ఏపీలో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉందని చెప్పవచ్చు. ప్రతిపక్ష నేతలు ప్రజల మద్యకు రావాలంటే ఆంక్షలు. అమరావతి రైతులు అరసవిల్లి పాదయాత్రకు బయలుదేరితే ఆంక్షలు. చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి ఐటి ఉద్యోగులు రాజమండ్రికి వస్తుంటే రాష్ట్ర సరిహద్దు వద్ద వందాలది పోలీసులను మోహరించి అడ్డుకొన్నారు.
తాజాగా అమరావతి రైతులు రాజమండ్రిలో నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుదామని బయలుదేరితే వారిని వీరవల్లి, నల్లజర్ల టోల్ గేట్ల వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. రాజమండ్రి వెళ్ళేందుకు వారికి అనుమతి లేదని పోలీసులు చెప్పేసరికి మహిళా రైతులు ఆగ్రహంతో, “మేమేమి తీవ్రవాదులం కాము. మేమేమీ పాకిస్తాన్ నుంచి రావడం లేదు. పాకిస్తాన్కు వెళ్ళడం లేదు. పక్కనే ఉన్న రాజమండ్రికి వెళుతున్నాము.
సాటి మహిళ నారా భువనేశ్వరికి కష్టమొస్తే ఆమెను కలిసి సంఘీభావం తెలుపుదామని వెళుతున్నాము. అందుకు పోలీసుల అనుమతి దేనికి?అసలు మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటున్నారు?” అని నిలదీశారు. కానీ వారు రాజమండ్రి ఎందుకు వెళ్ళకూడదో చెప్పడం లేదు కానీ వెళ్ళేందుకు అనుమతిలేదని చెపుతూ వారిని ముందుకు కదలనీయడం లేదు.
ఇది చూస్తే ఏపీలో ప్రజలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలా?అనే సందేహం కలుగక మానదు. నాలుగేళ్ళుగా ప్రతిపక్షాలపై ఇటువంటి ఆంక్షలు అమలుచేస్తున్నప్పుడు, ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఒక చోట నుంచి మరోచోటికి వెళుతుంటే అడ్డుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే “ఇదేమైనా పాకిస్తానా? మేమేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా లేదా పాకిస్తాన్ వెళ్తున్నామా?” అనే ప్రశ్న ఇటీవల తరచూ వినబడుతోంది.
అయినా అమరావతి రైతులు నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపితే వైసీపికి, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది, నష్టం ఏమిటి? నిత్యం ప్రతిపక్షాలను, తమ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేస్తున్న మీడియాను వేలెత్తి చూపుతున్న వైసీపి ప్రభుత్వం మరిప్పుడు చేస్తున్నదేమిటి?
అయినా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తేనో లేదా ప్రజలు ఆయనకు సంఘీభావం తెలపకుండా అడ్డుకొన్నంత మాత్రాన్న ప్రజాభిప్రాయం మారిపోతుందా? అందరూ వైసీపికే ఓట్లు వేసేస్తారా?



