టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పట్టణంలో దేవీచౌక్ సెంటర్ వద్ద రోడ్ షో నిర్వహించబోతే పోలీసులు ఆయన కాన్వాయ్ని అడ్డుకొన్నారు. దాంతో ఆయన కారు దిగి నడుచుకొంటూ దేవీచౌక్ సెంటర్ చేరుకొన్నారు. అప్పటికే అక్కడ వేలాదిమంది ప్రజలు చంద్రబాబు నాయుడు కోసం ఎదురుచూస్తున్నారు.
ఆయన అక్కడే ఉన్న వాహనంపైకి ఎక్కి ప్రసంగం ప్రారంభించగానే అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన టిడిపి నేతలు జనరేటర్ ఏర్పాటు చేసుకొంటే, దానిని పోలీసులు లాక్ చేశారు. దాంతో ఆ సభకి వచ్చిన ప్రజలు తమ సెల్ ఫోన్లలో టార్చిలైట్స్ ఆన్ చేయగా ఆ వెలుతురులోనే చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశ్యించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి “ఈ సైకో జగన్ నన్ను అడ్డుకొనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూశారా?విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయించాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరెప్పుడైనా చూశారా? అతను పోలీసుల పీక మీద కత్తి పెట్టి ఈవిదంగా చేయిస్తున్నాడని నాకు తెలుసు. అయితే ఈ పోలీసులే రేపు నావద్ద పనిచేయాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. నేను అధికారంలోకి రాగానే జగన్ మాటలు విని మీలో చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్న ప్రతీ ఒక్కరిపై తప్పకుండా కటిన చర్యలు తీసుకొంటాను. సైకో చెప్పిన్నట్లు చేస్తే రేపు మీరే ఇబ్బందులలో పడతారని గ్రహించండి. అనపర్తిలో రోడ్ షోకి ముందు అనుమతించింది మీరే కదా?మరెందుకు ఇప్పుడు అడ్డుకొని ఈవిదంగా వ్యవహరిస్తున్నారు?” అని పోలీసులని గట్టిగా నిలదీశారు.
చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలకి మంచి జనాధారణ లభిస్తుండటంతో వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి తీరు, ఆయన పాలనలో లోపాలు, వైఫల్యాలు, అవినీతి, అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు చెపుతున్నవి విని ప్రజలు ఎక్కడ ప్రభావితులవుతారో అనే భయంతోనే ఈవిదంగా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లని వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని, ఈవిదంగా ఇబ్బందులు పెట్టడం ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వారికి, టిడిపికే చాలా మేలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డుకోవడం, ఆయన ప్రసంగించబోతుంటే విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని ఈ సభకి హాజరైనవారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా టీవీ న్యూస్ ఛానల్స్లో చూశారు. కనుక జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదనలు నిజమేనని ప్రజలు కూడా భావించేలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈవిదంగా చేస్తుండటం వలన జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు, టిడిపి పట్ల సానుభూతి, అభిమానం నానాటికీ పెరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లని పోలీసులతో అడ్డుకోవడం లేదా ఈవిదంగా ఇబ్బందులు పెట్టడం ద్వారా వైసీపీ తాత్కాలిక సంతోషం, సంతృప్తి కలగవచ్చు కానీ ఈ వెర్రి చేష్టలే వైసీపీ కొంపముంచవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





