ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల ఈ నెల 21వ తేదీన విజయవాడకు వచ్చి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ముహూర్తం ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు మాత్రమే కాదు… అన్న జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు సందించేందుకు కూడా!
ఎందుకంటే, ఆమె రాజకీయ కాలక్షేపానికి రావడం లేదు కనుక! ఆమె ఏపీ కాంగ్రెస్కి జీవం పోసి మళ్ళీ బ్రతికించగలరనే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం మిగిలి ఉంది. కనుక ఆమె పగ్గాలు చేపడుతూనే చాలా దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
దూకుడుగా అంటే అన్న జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించడం…. వైసీపిలో అసంతృప్త నేతలందరినీ కాంగ్రెస్లోకి తెచ్చుకోవడమే అని వేరే చెప్పక్కరలేదు.
ఆమె కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపిలో టికెట్ల పంచాయితీ పెట్టుకుని సర్వం సిద్దం చేసి ఉంచారు. కనుక వైఎస్ షర్మిల వచ్చి కాంగ్రెస్ గేట్లు తెరిచి వారందరికీ స్వాగతం… సుస్వాగతం బోర్డు తగిలించడం ఖాయం.
తన సమర్దత నిరూపించుకొనేందుకు ఆమెకు ఇదే తొలి పరీక్ష అని చెప్పవచ్చు. కనుక ఆమె వస్తూనే వైసీపిపై యుద్ధం ప్రకటించవచ్చు. ఒకవేళ అంత స్పీడు వద్దనుకుంటే ఆమె కాంగ్రెస్లో ఉన్నారు కనుక బీజేపీని విమర్శిస్తూ కాలక్షేపం చేసే వెసులుబాటు కూడా ఉంది. కానీ తెలంగాణలో కేసీఆర్నే ఎదిరించిన వైఎస్ షర్మిల, ఏపీలో మెతకవైఖరి ప్రదర్శిస్తారనుకోలేము.
వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతూ ఏపీ కాంగ్రెస్లో మళ్ళీ జీవం పోయగలిగితే, కాంగ్రెస్ అధిష్టానం, కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు డికె శివకుమార్, సిఎం రేవంత్ రెడ్డి, కూడా ఆమెకు అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు.
కనుక జనవరి 21 ముహూర్తం వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు మాత్రమే కాదు వైసీపిని చీల్చి చెండాడేందుకు కూడా అని చెప్పక తప్పదు. ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి గురించి, వైసీపి ప్రభుత్వం గురించి ఏమి చెప్తారో అని తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




