తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో రాజకీయాలు ఇప్పుడు చాలా ‘స్ట్రెయిట్ ఫార్వర్డ్’గానే ఉన్నాయి. కుల రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు, బీజేపి కలిసి ఉన్నాయి. కిందామీద పడినప్పటికీ కూటమిలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ నిన్నే శాసనసభలో తేల్చి చెప్పేయడం జగన్కు చాలా నిరాశ కలిగించే విషయమే. టీడీపీ, జనసేనలు కేంద్రంలో ఎన్డీఏతో కూడా కలిసి ఉన్నాయి. ఇక వైసీపీ ఎప్పటిలాగే సింగిల్ సింహంలా ఒంటరిగానే ఉంది.
ఇదివరకులా కేంద్రంతో వైసీపీ లోపాయికారి స్నేహం చేయలేకపోతోంది. అది మెయిన్టైన్ చేసేందుకు విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో లేరు. కనుక ఏపీలో వైసీపీ వెర్సస్ కూటమి ప్రభుత్వం రాజకీయాలు ‘స్ట్రెయిట్ ఫార్వర్డ్’గా ఉన్నాయని భావించవచ్చు.
కానీ తెలంగాణలో రాజకీయాలే నేటికీ చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అక్కడా బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కనుక అక్కడా ‘స్ట్రెయిట్ ఫార్వర్డ్’ రాజకీయాలే సాగుతుండాలి. కానీ మూడు పార్టీలు కలిసి మూడు స్తంభాలాట ఆడుతున్నాయి. ఓ పక్క కత్తులు దూసుకుంటూనే మరోపక్క కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ఇదివరకు బిఆర్ఎస్ నేతలు బెదిరించేవారు. కేసీఆర్ ఫామ్హౌస్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు బీజేపి నేతలు బెదిరిస్తున్నారు. అంటే రెండు పార్టీలు కలిసి కూల్చేయబోతున్నాయా?అనే సందేహం కలుగుతుంది.
ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులని ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా కేంద్రమే కాపాడుతోందని రేవంత్ రెడ్డి చెప్పేశారు. కనుక ఆ రెండు పార్టీలకు మద్య అండర్ స్టాండింగ్ ఉందనిపిస్తుంది.
కానీ ఆ కేసులు సీబీఐకి అప్పగిస్తే వెంటనే వాళ్ళని మేమే లోపలేస్తామని, కానీ కేసులు అప్పగించకుండా ఆ ముగ్గురినీ రేవంత్ రెడ్డే కాపాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఇంతకీ ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? ఎందుకు? అని ఆలోచిస్తే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సంక్లిష్టంగా ఉన్నట్లనిపిస్తుంది.




