ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవడం విశేషం. ఆయన మొదట వైసీపీలోనే ఉండేవారు. వైసీపీ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు నిలిపివేయడంతో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ దానిలో ఇమడలేక బయటకు వచ్చి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్తో రాజకీయ పరిచయం మాత్రమే కాదు… జగన్ ప్రభుత్వం ఆయన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలకు ఏపీలో వేలకోట్లు విలువగల ప్రాజెక్టులు కూడా ఇచ్చినందున, వారి మద్యన మంచి బలమైన అనుబంధమే ఉందని భావించవచ్చు.
కనుక ఆయన ఆ కాంట్రాక్టులు, వ్యాపారాల గురించి మాట్లాడేందుకే తాడేపల్లి వచ్చి సిఎం జగన్ను కలిశారా? లేక మరేదైనా పని మీద వచ్చి కలిశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే వచ్చి సిఎం జగన్ కలవడం వలన, ఆయన కాంగ్రెస్ రాయబారిగా రాజకీయ చర్చలు జరిపేందుకు వచ్చారా?అనే సందేహం కూడా కలుగుతోంది.
వైఎస్ షర్మిల త్వరలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్లో చేరబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తెలంగాణ కాంగ్రెస్లో కాకుండా ఏపీ కాంగ్రెస్లో చేరాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు.
ఒకవేళ ఆమె అందుకు సిద్దపడితే జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున అది జరుగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే, ముందుగా అన్నా, చెల్లెళ్ళ మద్యనే యుద్ధం మొదలవుతుందని వేరే చెప్పక్కరలేదు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్, షర్మిల, విజయమ్మ ముగ్గురితో సత్సంబంధాలు ఉన్నందున అన్నాచెల్లెళ్ళ మద్య యుద్ధం నివారించేందుకు ఆమె తరపున రాయబారానికి వచ్చి ఉండవచ్చు. ఒకవేళ రాజకీయ రాయబారం కోసం కాకపోతే ఏపీలో ఆయన కంపెనీ కాంట్రాక్టులు, వ్యాపారాల గురించి అయ్యుండవచ్చు. ఇంతకీ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతారా లేదా?అనేది జూలై 8న తెలిసే అవకాశం ఉంది.



