ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు మూడు రోజుల ముందుగానే పోస్టల్ బ్యాలట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జగన్ ప్రభుత్వం వారందరితో 5 ఏళ్ళుగా ఆటలాడుకుంది. కనుక వారందరూ కూడా వైసీపికి వ్యతిరేకంగానే ఓట్లు వేసి ఉంటారని వేరే చెప్పక్కరలేదు.
కనుక ఏదో విదంగా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తగ్గించగలిగితే ఆ మేరకు వైసీపికి నష్టం తగ్గుతుందని అనుకుంది. అయితే వైసీపి ఒకటనుకుంటే ఈసీ మరొకటనుకుంది.
పోస్టల్ బ్యాలట్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో వైసీపి షాక్ అయ్యింది. దానిపై రెండు రోజులు గగ్గోలు పెట్టిన తర్వాత ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపి నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
ఈవిదంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తే గొడవలు జరిగే అవకాశం ఉంటుందని కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించాలని పిటిషన్లో కోరింది. అయితే దీనిపై హైకోర్టు విచారణ చేపట్టేలోగానే ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఓ లేఖ పంపింది.
దానిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని, రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే గెజిటెడ్ అధికారులు సంతకం చేసి, సీల్ వేస్తారని కనుక పోస్టల్ బ్యాలట్ పత్రాలపై వారి సీల్, హోదా లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయని, రిటర్నింగ్ అధికారులకు ఈవిషయం తెలియజేయాలని ఈసీ ఆ లేఖలో పేర్కొంది. ముఖేష్ కుమార్ మీనా వెంటనే ఈసీ ఆదేశాన్ని రిటర్నింగ్ అధికారులకు తెలియజేశారు.
ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై వైసీపి మండిపడుతుంటే, దాని నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఈసీ ఇంత వేగంగా లేఖ పంపడాన్ని వైసీపి జీర్ణించుకోవడం కష్టమే. కనుక వైసీపి నేతలు మళ్ళీ దీనిపై కూడా మరి కొన్ని కొత్త రాగాలు ఆలపించక తప్పదు.
హైకోర్టు వారి పిటిషన్ను విచారణకు స్వీకరించినప్పటికీ, ఈసీ కూడా న్యాయస్థానాల మాదిరిగానే రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయబడిన ఓ స్వతంత్ర సంస్థ… ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో దానికి సర్వాధికారాలు ఉంటాయి. కనుక ఈవిషయంలో హైకోర్టు కూడా కలుగజేసుకోకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే వైసీపి నేతలు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలీని పరిస్థితి ఏర్పడుతుంది.
పోస్టల్ బ్యాలట్ ఓట్లను చూసి వైసీపి ఇంతగా ఆందోళన చెందుతుండటమే వైసీపి ఓడిపోబోతోందని సూచిస్తోంది కదా? కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా చేయకూడని తప్పులన్నీ చేసి ఇప్పుడు ఎవరెవరినో నిందించి ఏం ప్రయోజనం?




