తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేకనే విద్యుత్, నీరు వంటి అన్ని సమస్యలు తీరాయని సిఎం కేసీఆర్ మొదలు ఎమ్మెల్యే వరకు నిత్యం గొప్పలు చెప్పుకొంటుంటారు. అది నిజం కూడా. అయితే చాలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకి కేంద్రం సహకారం పొందుతూ కూడా అంతా మేమే చేస్తున్నామన్నట్లు గొప్పలు చెప్పుకొంటారు.
తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే సిఎం కేసీఆర్ విద్యుత్ సమస్యలను శాస్వితంగా పరిష్కరించేశారని, దేశంలో కనురెప్పపాటు కూడా కరెంటు పోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గొప్పగా చెప్పుకొంటుంటారు. దేశంలోకెల్ల గరిష్టంగా విద్యుత్ వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అని గొప్పగా చెప్పుకొంటారు. రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని చెప్పుకొంటారు.
కానీ ఇప్పుడు విద్యుత్ కొరత కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలు విదిస్తోంది. దీనిపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు అప్పుడే నిలదీస్తున్నాయి కూడా. ఇప్పటివరకు ఈ క్రెడిట్ అంతా మాదే..దీంతో కేంద్రానికి ఎటువంటి సంబందమూ లేదన్నట్లు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకొన్న టిఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు మాట మార్చింది.
ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం అస్తవ్యస్తమైన విధానాల వలననే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడుతోంది. కేంద్రప్రభుత్వం సరఫరా చేయలేదు. పోనీ విద్యుత్ సరఫరా చేస్తున్న కంపెనీల నుంచి మా ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయాలనుకొంటే దానికీ అడ్డుపడుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది,” అని ఆరోపించారు.
ఏదైనా సజావుగా సాగిపోతున్నంత కాలం ఆ క్రెడిట్ అంతా మాదేనని, కేంద్రం పైసా ఇవ్వలేదని గట్టిగా టిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటారు కానీ సమస్య మొదలయ్యేసరికి కేంద్రప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెడతారు. అంటే ఇంతకాలం విద్యుత్ సమస్యను అధిగమించడానికి కేంద్రం సహాయాసహకారాలు అందించిందని ఒప్పుకోన్నట్లే కదా?అనవసరమైన గొప్పలు చెప్పుకోవడం దేనికి? సమస్య ఎదురైనప్పుడు ఇలా కేంద్రాన్ని నిందించడం దేనికి?



