గతంలో హల్చల్ చేసిన ఓ విషయం తాజాగా మరోసారి లైంలైట్ లోకి వచ్చింది. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఒక సామాజిక కార్యక్రమాన్ని ఓ ప్రముఖ హీరోతో రూపొందించాలని ‘ఈటీవీ’ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రూపొందించిన ‘సత్యమేవ జయతే’ తరహాలో ఈ కార్యక్రమం ఉండేలా భావిస్తున్నారని, అమీర్ స్థానంలో టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేసిన సంగతులు విదితమే.
అయితే తాజాగా దీనికి సంబంధించిన పనులు వేగం పుంజుకున్నాయని, ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించేందుకు, సామాజిక అంశాలను తన చిత్రాలను మేళవించే ప్రముఖ దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సినీ వర్గాల టాక్. మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో గానీ, ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ కార్యక్రమంలో పవన్ నటిస్తున్నట్లుగా ఖరారు చేసేస్తున్నాయి. ఇదే జరిగితే పవన్ అభిమానులకు పండగేనని చెప్పకతప్పదు.
ఒక్క పిట్టకే రెండు దెబ్బలు అన్నట్టు… కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్ధిక పరిపుష్టితో పాటు రాజకీయంగా ‘జనసేన’ను ప్రజల్లోకి తీసుకెళ్ళే మంచి అవకాశం పవన్ కళ్యాణ్ కు లభించినట్లవుతుంది. ఈ ప్రయోజనాలను పక్కన పెడితే, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఒక అరుదైన అవకాశం దక్కించుకున్న వారవుతారు. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ కార్యక్రమం కార్యరూపం సిద్ధించాలని కోరుకుందాం.



